మహిళల భద్రతే ముఖ్యం | - | Sakshi
Sakshi News home page

మహిళల భద్రతే ముఖ్యం

Aug 23 2025 12:52 PM | Updated on Aug 23 2025 12:52 PM

మహిళల

మహిళల భద్రతే ముఖ్యం

నారాయణపేట: మహిళలు, విద్యార్థినుల భద్రతే పోలీసు ప్రధాన కర్తవ్యమని.. వారిపై జరుగుతున్న వేధింపులను పూర్తిగా అరికట్టడంలో షీటీం పోలీసులు మరింత చురుకుగా పనిచేయాలని, ఈమేరకు జిల్లాలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సీఐడీ ఎస్పీ అన్యోన్య అన్నారు. శుక్రవారం జిల్లాకు వచ్చిన ఆయన ఎస్పీ యోగేష్‌గౌతమ్‌తో కలిసి సిబ్బందితో సమావేశమయ్యారు. జిల్లాలో షీ టీం పోలీసులు కాలేజీ, పాఠశాల, పబ్లిక్‌ ప్లేస్లలో మహిళల భద్రతపై నిఘా పెంచాలని సూచించారు. విద్యార్థులకే కాకుండా వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, మహిళలను ఎవరైనా వేధిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి వేధింపులు, వేధింపుల పోన్‌ కాల్స్‌, ఈవ్‌ టీజింగ్‌ సోషల్‌ మీడియాలో వేధింపులు జరిగిన వెంటనే బాధితులు పోలీసులను సంప్రదించాలన్నారు. మహిళలపై దాడులు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించి ప్రతి టీం సభ్యుడు సమన్వయం, సమయపాలన పారదర్శకతతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో ఏఎస్పీ రియాజ్‌, సీఐడి సిఐ లక్ష్మణ్‌ నాయక్‌, ఎహెచ్‌టీయు ఎస్‌ఐ కృష్ణంరాజు, షి టీమ్‌ పోలీసులు, భరోసా సెంటర్‌ బృందం,ఎహెచ్‌టీయు బృందం తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం

మక్తల్‌/దామరగిద్ద: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని అడిషనల్‌ కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌ అన్నారు. శుక్రవారం మక్తల్‌ ఎంపీడీఓ కార్యాలయంలో మక్తల్‌, మాగనూర్‌, కృష్ణ, నర్వ , ఊట్కూర్‌ మండలాలకు చెందిన హౌజింగ్‌, ఎంపీడీఓలు, కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ఎందుకు వేగవంతం చేయడంలేదని, కొన్ని పునాది దశలో ఉన్నాయని, వెంటనే నిర్మాణ పనులు చేపట్టాలని అన్నారు. అధికారులు విధిగా లబ్ధిదారులను కలిసి పనులు పూర్తి చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ ప్రణయ్‌కుమార్‌, పీడీ శంకర్‌, డీపీఓ సుధాకర్‌రెడ్డి, ఎంపీడీఓలు రమేష్‌, శ్రీనివాసులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులకు శ్రీకారం

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనుల జాతర కార్యక్రమంలో భాగంగా ప్రారంభించిన పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌ అన్నారు. శుక్రవారం దామరగిద్ద మండలంలోని ఆశన్‌పల్లిలో గ్రామ పంచాయతీ భవనానికి భూమిపూజ చేశారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.

గణేష్‌ మార్గ్‌ పరిశీలన

నారాయణపేట: గణేష్‌ ఉత్సవాల నేపథ్యంలో కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే కొండరెడ్డిపల్లి చెరువు, గణేష్‌ మార్గ్‌ను శుక్రవారం ఆర్డీఓ రాంచందర్‌, డీఎస్పీ లింగయ్య పరిశీలించారు. ముందస్తు చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. కొండరెడ్డిపల్లి చెరువు నుంచి జిల్లా కేంద్రంలోని గణేష్‌ మార్గ్‌ను మెయిన్‌చౌక్‌ నుంచి సరాఫ్‌బజార్‌, గుడ్‌లక్‌ కమాన్‌, హజారి హోటల్‌, మాసుమలీదర్గా, అంబా భవాని టెంపుల్‌, చౌడేశ్వరి టెంపుల్‌, కాలమ్మ గుడి, ఉట్కూర్‌ మజీద్‌ మెయిన్‌ రోడ్‌, ఓల్డ్‌ బస్టాండ్‌ తదితర మార్గంలో అధికారుల బృందం పరిశీలించి రోడ్డుపై గుంతలు ఉన్నచోట మరమ్మతులు చేయాలని, రోడ్డుపైన విద్యుత్‌ వైర్లు, కేబుల్‌ వైర్లను, రోడ్డుకు అడ్డంగా ఉండే చెట్ల కొమ్మలను తొలగించాలని ఆదేశించారు. నిమజ్జనం సమయంలో క్రేన్లు, ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా చూడాలని, శాంతి భద్రత పరిరక్షణ కోసం పోలీస్‌ విభాగం ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు డీఎస్పి తెలిపారు. కార్యక్రమంలో సీఐ శివశంకర్‌, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, ఇరిగేషన్‌, విద్యుత్‌, మున్సిపల్‌, ఫిషరీస్‌ తదితర అధికారుల బృందం పాల్గొన్నారు.

మహిళల భద్రతే ముఖ్యం 
1
1/2

మహిళల భద్రతే ముఖ్యం

మహిళల భద్రతే ముఖ్యం 
2
2/2

మహిళల భద్రతే ముఖ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement