
భూనిర్వాసితులకు ఎకరాకు రూ.35 లక్షలివ్వాలి
నారాయణపేట: నారాయణపేట–కొడంగల్ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న భూనిర్వాసితులకు ఎకరాకు రూ.35 లక్షలకు తగ్గకుండా పరిహారం ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం నారాయణపేట మండలపరిధిలోని పేరపళ్లలో రిజర్వాయర్లో మునుగుతున్న పంట పొలాలను ఆయన పరిశీలన చేశారు. భూములు కోల్పోతున్న భూనిర్వాసితులతో మాట్లాడారు. ప్రజా పాలన, ప్రజా సంక్షేమ కోసం పనిచేస్తున్నామని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. తన తన సొంత నియోజకవర్గంలో భూ నిర్వాసితులకు అతి తక్కువ పరిహారం ఇస్తూ అన్యాయం చేయొద్దని హితవు పలికారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని, బలవంతంగా కాకుండా భూయజమానుల సమ్మతి మేరకే భూములను సేకరించాలని కోరారు. నెల రోజులుగా భూ నిర్వాసితులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నేటికీ స్పష్టంగా పరిహారాన్ని ప్రకటించకపోవడం ఏమిటని ప్రవ్నించారు. సీపీఎం రాష్ట్ర నాయకులు టి.సాగర్, వెంకట్రాములు మాట్లాడుతూ బహిరంగ మార్కెట్ ధరలకు అనుగుణంగా పరిహారం అందించినప్పుడే భూనిర్వాసితులకు న్యాయం జరుగుతుందన్నారు. భూ నిర్వాసితుల పక్షాన సీపీఎం పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ప్రభుత్వంపై పట్టుదలతో పోరాటం చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో భూ నిర్వాసితుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి, అధ్యక్షుడు మచ్చేందర్, నాయకులు గోపాల్, బాలరాం, అంజిలయ్య గౌడ్, ఆంజనేయులు, గోవిందరాజు, జోషి పాల్గొన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అందుకు కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావాలని జాన్వెస్లీ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా స్థాయి సమావేశానికి ఆయన ముఖ్యవక్తగా హాజరై మాట్లాడారు. ఎన్నికల కమిషన్ను అడ్డుపెట్టుకొని దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చే కుట్ర జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 65 లక్షల దొంగ ఓట్లు నమోదు కావడానికి కారణం ఎవరని ప్రశ్నించారు. సీబీఐ, ఈడీ, ఎన్నికల కమిషన్ తదితర రాజ్యాంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం అధినేతలు తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని విమర్శించారు.