
రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ
నారాయణపేట: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం సేకరణ చేపట్టాలని ఎమ్మెల్యే డా.చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని సింగిల్విండో కార్యాలయం వద్ద మంగళవారం వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యాసంగిలో పండించిన వరిధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు ఇబ్బందులు పడొద్దన్న ఉద్దేశంతో గ్రామాల్లోనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందన్నారు. గ్రేడ్–ఏ ధాన్యాన్ని రూ. 2,320, సాధారణ గ్రేడ్ ధాన్యాన్ని రూ. 2,300 ధరకు కొనుగోలు చేయడంతో పాటు సన్నరకాలకు క్వింటాల్ రూ. 500 చొప్పున బోనస్ ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శివారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కె.నర్సింహారెడ్డి, కార్యదర్శి పి.అశోక్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.