● కక్షిదారుల మధ్య తలెత్తే వివాదాలను
సామరస్యపూర్వకంగా పరిష్కరించాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.వాసు
ఆత్మకూరు: మధ్యవర్తిత్వంతో ప్రజలు కేసులను సత్వరం పరిష్కరించుకోవచ్చని, ఈ మేరకు న్యాయవాదులు కృషి చేయాలని ఫుల్ అడిషనల్ చార్జ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.వాసు, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి పేర్కొన్నారు. ఆత్మకూరులోని కోర్టు ఆవరణలో శనివారం మెజిస్ట్రేట్ రాహుల్ అంబేడ్కర్ అధ్యక్షతన న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. మధ్యవర్తిత్వం 3.0పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ. కక్షిదారుల మధ్య తలెత్తే వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలన్నారు. మధ్యవర్తులు తమ నైపుణ్యాలను సమర్థవంతంగా వినియోగించి ఇరుపక్షాలకు మెరుగైన సేవలను అందించాలన్నారు. కార్యదర్శి బి.లీలావెంకటశేషాద్రి మాట్లాడుతూ.. కోర్టులలో పెండింగ్లో ఉన్న కేసులను మధ్యవర్తిత్వం ద్వారా న్యాయవాదులు త్వరగా పరిష్కరించుకోవచ్చన్నారు. న్యాయవాదులు తమ సహాయ సహకారాలను మధ్యవర్తిత్వ 3.0 ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆత్మకూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నగేష్, సెక్రటరీ సుదర్శన్, న్యాయవాదులు పాల్గొన్నారు.


