నంద్యాల (వ్యవసాయం): వివిధ పోలీస్ స్టేషన్లలో రాజీకి అవకాశం ఉన్న కేసులను ముందుగానే గుర్తించి లోక్ అదాలత్లో పరిష్కారమయ్యే విధంగా కృషి చేయాలని మూడవ అదనపు జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, లోక్ అదాలత్ చైర్మన్ అమ్మనరాజ, ఏఎస్పీ సుస్మిత పోలీస్ అధికారులకు సూచించారు. శనివారం కోర్టు ఆవరణలో మండల లీగల్ సెల్ ఆధ్వర్యంలో వివిధ పోలీస్ స్టేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పోలీసుస్టేషన్లలో కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, చిన్నపాటి వివాదాలకు సంబంధించిన కేసు లు, పెండింగ్ కేసుల వివరాలను పరిశీలించి రాజీ అయ్యేలా కక్షిదారులకు కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. రాజీ పూర్తిగా స్వచ్ఛందంగా, చట్టబద్ధంగా ఉండేలా చూడాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసులు అన్నారు. మెగా లోక్ అదాలత్లో ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారం కావడం మాత్రమే లక్ష్యం కాదని, ప్రతి కేసు ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన న్యాయం జరగడం ప్రధానమన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ, సీఐలు, ఎస్ఐలతో పాటు, లోక్అదాలత్ సిబ్బంది రామచంద్రారెడ్డి, భాస్కర్ పాల్గొన్నారు.


