● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: మున్సిపాలిటీల వారీగా ఫొటో ఓటర్ల జాబితాల ప్రచురణకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ, తాగునీటి సరఫరా , పరిశుభ్రతపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. జెడ్పీ సీఈవో సుబ్బారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారిని లలితాబాయి, మున్సిపల్ కమిషనర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం వారి ఆదేశాల మేరకు అన్ని మున్సిపాలిటీలో వార్డులవారీగా ఫొటో ఓటర్ల జాబితాను సిద్ధం చేసి సెప్టెంబర్ 3న సంబంధిత కార్యాలయాల్లో ప్రచురించాలన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా పోలింగ్ కేంద్రాల పరిశీలన, ప్రచురణ కార్యక్రమం పూర్తి చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు కార్యక్రమం ప్రారంభం అవుతుందని తెలిపారు. జిల్లాలో అన్ని మున్సిపాలిటీల్లో తాగునీటి సరఫరాపై మందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుద్ధ్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రోడ్లు, కాలువలు, డ్రైనేజీలు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త పేరుకుపోకుండా చూడాలన్నారు.


