● 7గురు ప్రొటెక్షన్ వాచర్ల తొలగింపు
ఆత్మకూరు రూరల్: గత ఏడాది సెప్టెంబర్లో ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని ఇందిరేశ్వరం సెక్షన్లో ఒక పెద్దపులి ఉచ్చుకు చిక్కుకోగా విషయం తెలిసి కూడా ఎన్టీసీఏ మార్గదర్శకాలు పాటించకుండా రహస్యంగా పులి కళేబరాన్ని దగ్ధం చేసిన ఘటనపై అటవీశాఖ చర్యలు మొదలు పెట్టింది. అప్పటి ఇందిరేశ్వరం ఎఫ్ఎస్ఓ డి.మహబూబ్బాషాను డిప్యూటీ డైరెక్టర్ విగ్నేష్ అపావ్ బుధవారం సస్పెండ్ చేశారు. అలాగే అందుకు సహకరించిన ఏడుగురు ప్రొటెక్షన్ వాచర్లను విధుల నుంచి తొలగించారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ పులి ఉచ్చులకు చిక్కుకోవడం ఒక విషాదమైతే.. ఆ విషయాన్ని దాచి పెట్టి సాక్ష్యాలను ధ్వంసం చేయడం క్షమించరాని నేరమన్నారు. అటవీ శాఖలో మొలచిన కలుపు మొక్కలను పీకివేస్తామని.. తిరిగి నాగార్జునసాగర్–శ్రీశైలం అభయారణ్యంలో ఆత్మకూరు డివిజన్ను దుర్భేద్యంగా నిలబెడతామని ఆశాభావం వెలిబుచ్చారు.


