● వైఎస్సార్సీపీలో చేరిన వంద మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు
చాగలమర్రి: కేవలం రెండు సంవత్సరాల పాలన కాలంలోనే ప్రజావ్యతిరేకతను చంద్రబాబు ప్రభుత్వం మూటగట్టుకుందని ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి అన్నారు. చాగలమర్రి మండలంలోని గొడిగనూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఏడు కుటుంబాలకు చెందిన 100 మంది బుధవారం వైఎస్సార్సీపీలో చేరారు. మాజీ సర్పంచ్ పత్తి నారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గొడిగనూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు పొలికల చిన్న రామిరెడ్డి, పెద్దిరెడ్డి, లింగారెడ్డి, రామచంద్రారెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, కమటం నరసింహారెడ్డితో పాటు వారి కుటుంబాలకు చెందిన సుమారు 100 మందిసభ్యులకు వైఎస్సార్సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంలో శాంతిభద్రతలు లోపించాయన్నారు. పోలీసులపైనే టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడులకు దిగుతున్నారని, రాష్ట్రంలో హింస పెచ్చరిల్లిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇసుక మాఫియా ఆగడాలు చెప్పనలవి కావడం లేదన్నారు. గంజాయి విక్రయం విచ్చలవిడిగా చేస్తుండటంతో యువత మత్తులో మహిళలపై ఘోరాలకు పాల్పడుతున్నారన్నారు. చంద్రబాబు పాలనపై రాష్ట్ర ప్రజలు విసుగు చెందారని, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే వైఎస్సార్సీపీదే విజయం అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ జి.కుమార్రెడ్డి, మండల కార్యదర్శి శేషు రమేష్, ఎంపీటీసీ కె. లక్ష్మీరెడ్డి, పార్టీ నాయకులు నరసింహారెడ్డి, సుధాకర్రెడ్డి, మనోహర్రెడ్డి, మాజీ సర్పంచ్లు రమణారెడ్డి, వెంకట్రామిరెడ్డి, షరీఫ్, రామకృష్ణారెడ్డి, చిన్న నాయుడు, మండల నాయకులు సుబ్బారాయుడు, అంకాల్రెడ్డి, చాంద్బాషా, పవన్ కుమార్, కదిరి దస్తగిరి పాల్గొన్నారు.


