కర్నూలు(సెంట్రల్): నగరంలోని పాతబస్తీలో నివాసం ఉంటున్న జావీద్బాషా ప్యాసింజర్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి ముగ్గురు పిల్లలు సంతానం. అయితే ఒక్కరికీ తల్లికి వందనం వర్తించకపోవడంతో తీవ్ర ఆవేదనకు లోనవుతున్నాడు. వృత్తిరీత్యా ఆటోకు సంబంధించిన ఈఎంఐలు, ఇంటి అద్దె, పొదుపు లోన్లను అతికష్టం మీద చెల్లిస్తున్నాడు. అయితే అతను ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్నారనే కారణంతో ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడికి తల్లికి వందనం వేయలేదు. గతేడాది కూడా ఇదే కారణంతో తల్లికి వందనాన్ని తిరస్కరించారు. అయితే అప్పట్లో తనకు ఎలాంటి ఐటీ రిటర్న్స్ లేవని పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూడా తల్లికి వందనాన్ని ప్రభుత్వం ఎగ్గొట్టింది.


