జిల్లా అధ్యక్షుడు
నంద్యాల: ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా వ్యాప్తంగా చేపడుతున్న నిరసన ర్యాలీలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చాలన్న డిమాండ్తో జిల్లాలో ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఈ ర్యాలీల్లో పెద్ద ఎత్తున పార్టీ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొనాలన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల వంచన పాలనను ఎండగడుతూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఆందోళనలో భాగంగా ఈనెల 3వ తేదీన వైఎస్సార్సీపీ సమన్వయకర్తల ఆధ్వర్యంలో పోస్టర్లు, బుక్లెట్లు ఆవిష్కరించామని, 4వ తేదీన మండల కేంద్రాల్లో టీడీపీ మ్యానిఫెస్టో, సూపర్ సిక్స్ హామీలు, బాండ్లను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశామన్నారు. జూన్ 8వ తేదీన ప్రభుత్వ వైఫల్యాలను చెప్పే విధంగా సమావేశాలు నిర్వహించి నల్ల బెలూన్లు ఎగురవేశామన్నారు. అలాగే చంద్రబాబు మోసాలను, టీడీపీ నాయకుల అక్రమాలను ఫొటో గ్యాలరీలు పెట్టి ప్రజలకు వివరించామన్నారు. ఈ నెల 12న శుక్రవారం నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే ‘ బాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, రైతులు, నిరుద్యోగులు, యువకులు, మహిళలు భారీగా తరలి వచ్చి గళం వినిపించాలన్నారు.
కాటసాని రాంభూపాల్రెడ్డి


