● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో నిర్వహించనున్న యోగా కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు, యోగా అసోసియేషన్లు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో యోగా అసోసియేషన్ ప్రతినిధులు, సభ్యులు, సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై యోగా ప్రచార కార్యక్రమాలు, ప్రజల్లో యోగాపై అవగాహన పెంపు చర్యలు, నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక యోగా కార్యక్రమాలు, అవగాహన ర్యాలీలు, శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహానంది దేవస్థానం ప్రాంగణంలో శుక్రవారం ఉదయం 6.30 గంటలకు సుమారు 1,500 మందితో యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. జూన్ 17న నంద్యాల పట్టణంలో సుమారు 5,000 మందితో భారీ యోగా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, ఆయూష్ కో ఆర్డినేటర్ యశోద, డీఎస్డీఓ రాజు, యోగా అసోసియేషన్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.


