మేల్కోకుంటే సీమ ఎడారే..!
● పోతిరెడ్డిపాడు సభను
విజయవంతం చేద్దాం
● రాయలసీమ ద్రోహి చంద్రబాబు
● ‘చలో పోతిరెడ్డిపాడు’
పోస్టర్ ఆవిష్కరించిన
కాటసాని రాంభూపాల్రెడ్డి
కల్లూరు: రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు అడ్డుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సీమ ద్రోహిగా నిలిచారని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి విమర్శించారు. పోతిరెడ్డిపాడు వద్ద నిర్వహించనున్న బహిరంగ సభకు సంబంధించిన ‘చలో పోతిరెడ్డిపాడు’ కార్యక్రమం పోస్టర్లను బుధవారం కాటసాని రాంభూపాల్రెడ్డి నివాసంలో ఆవిష్కరించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు పునఃప్రారంభించాలని గురువారం పోతిరెడ్డిపాడు వద్ద నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. రాయలసీమ ప్రాంతానికి జరిగే అన్యాయాన్ని తెలిపేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. రాయలసీమలో ఎత్తిపోతల పథకం లేకపోతే సీమలోని అన్ని ప్రాంతాలు కరువుతో అల్లాడుతాయన్నారు. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం పనులు 90 శాతం పూర్తయ్యాయని, మిగతా పనులు జరగకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఈ పథకంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. సీమ ప్రాంత ప్రయోజనాల కోసం చేపట్టనున్న కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని, పార్టీలకు అతీతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాయలసీమ రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా వైఎస్సార్సీపీ పోరాటం చేస్తోందన్నారు.


