మహానందిలో 13 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
మహానంది: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మహానందిలో ఈ నెల 13 నుంచి నిర్వహిస్తున్నట్లు ఈఓ శ్రీనివాసరెడ్డి, వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని తెలిపారు. ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలు, పోస్టర్లు బుధవారం విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల 13న ఉత్సవాలను అంకురార్పణ, ధ్వజారోహణంతో ప్రారంభిస్తామన్నారు. 15న మహాశివరాత్రి సందర్భంగా లింగోద్భవకాలంలో మహానందీశ్వర స్వామికి మహారుద్రాభిషేకం నిర్వహిస్తామన్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు కల్యాణోత్సవం చేపడతామన్నారు. 16వ తేదీన ఉదయం అశ్వ వాహనసేవ, రాత్రి పుష్పపల్లకీ సేవ ఉంటుందన్నారు. 17న మహానందీశుని రథోత్సవం, రాత్రి పుష్పశయనోత్సవం పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 18న మహాపూర్ణాహుతి, రాత్రి తెప్పోత్సవం ఉంటాయన్నారు. కార్యక్రమంలో ప్రధానార్చకులు మామిళ్లపల్లి అర్జునశర్మ, ఉప ప్రధాన అర్చకులు మూలస్థానం శివశంకర శర్మ, ఏఈఓ ఎరమల మధు తదితరులు పాల్గొన్నారు.


