
దేశభక్తి ఉప్పొంగేలా హర్ ఘర్ తిరంగా !
నంద్యాల: ప్రజల్లో దేశభక్తి ఉట్టిపడేలా హర్ఘర్ తిరంగా కార్యక్రమాలను నిర్వహించాలని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. మంగళవారం ‘హర్ ఘర్ తిరంగా‘ కార్యక్రమాన్ని పురస్కరించుకుని టెక్కె మా ర్కెట్ యార్డ్ నుంచి గాంధీ చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా మంత్రి, కలెక్టర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. పట్టణంలోని వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు జిల్లా అధికారులు కలిసి 100 మీటర్ల జాతీయ పతాకం ర్యాలీలో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశమంతా ప్రజలు హర్ఘర్ తిరంగా కార్యక్రమాలు ఉత్సాహంగా జరుపుకుంటున్నారని, ప్రతి ఒక్కరూ దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన మహనీయుల జీవిత గాథలను గుర్తు చేసుకుని దేశ అభివృద్ధికి పునరంకితమవ్వాలని పిలుపునిచ్చారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగుర వేయాలన్నారు. జిల్లా కలెక్టర్ రాజ కుమారి మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు జరుపుకుంటున్నామన్నారు. నేపథ్యంలో స్వాంత్రంత్యం కోసం ప్రాణాల ర్పించిన మహనీయుల త్యాగనిరతిని, వారు దేశానికి అందించిన సేవలను స్మరించుకుంటూ భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలన్నారు. కార్యక్రమంలో పర్యాటక అధికారి సత్యనారాయణ, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.