
ఆధార్ సెంటర్ ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం
కర్నూలు: ఆధార్ సెంటర్ ఇప్పిస్తానని చెప్పి కర్నూలు బుధవారపేటకు చెందిన బోయ శేఖర్ రూ.60 వేలు తీసుకుని మోసం చేశాడని మంత్రాలయంకు చెందిన వీరేష్ ఎస్పీ విక్రాంత్ పాటిల్కు ఫిర్యాదు చేశారు. కర్నూలు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి వినతులను స్వీకరించి నేరుగా వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పీజీఆర్ఎస్కు మొత్తం 81 ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నిటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా కూడా కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.
పీజీఆర్ఎస్కు వచ్చిన వినతుల్లో కొన్ని...
● కర్నూలు అశోక్ నగర్కు చెందిన వినయ్ కుమార్ కడప రిమ్స్లో తన భార్యకు స్టాఫ్ నర్సు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.1.50 లక్షలు తీసుకుని మోసం చేశాడని నంద్యాల పట్టణానికి చెందిన ప్రదీప్ ఫిర్యాదు చేశారు.
● కర్నూలు మండలం పసుపుల, రుద్రవరం, నూతనపల్లె గ్రామాల రైతుల నుంచి పసుపల గ్రామానికి చెందిన పకిడి ఖాజా అనే వ్యాపారి రైతుల నుంచి పొగాకు కొనుగోలు చేసి సొమ్ము చేసుకుని డబ్బులు ఇవ్వకుండా మోసం చేశాడని, విచారణ జరిపి తగు న్యాయం చేయాల్సిందిగా అదే గ్రామానికి చెందిన సుల్తాన్ ఫిర్యాదు చేశారు.
● నన్నూరు గ్రామానికి చెందిన గుర్రం నాగన్న, వెంకటస్వామి, వెంకటరాముడు, ఉపేంద్రలు కలసి తన పొలానికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని, సర్వే చేయించడానికి కూడా సహకరించడం లేదని ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామానికి చెందిన కనకమ్మ ఫిర్యాదు చేశారు.
● కర్నూలుకు చెందిన రవీంద్ర పాతబస్తీలోని పూలబజార్కు చెందిన కొంతమంది మహిళల నుంచి ఆధార్ కార్డు, పాన్ కార్డు, సిమ్ కార్డు, ఫొటోలు తీసుకుని బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేయించి వారికి తెలియకుండా వారి పేర్ల మీద ఏసీలు, టీవీలు, సెల్ఫోన్లు తీసుకుని మోసం చేస్తున్నాడని కర్నూలు వడ్డెగేరికి చెందిన షేక్ సన ఫిర్యాదు చేశారు.
● రాజు, మహేష్ అనే వ్యక్తులు ఫోర్జరీ పట్టాదారు పాసు పుస్తకాలు తయారు చేసుకుని తమ ఆస్తిని ఆక్రమించుకోవాలని చూస్తున్నారని, నన్ను, మా నానమ్మను కొట్టి చంపుతామని బెదిరిస్తున్నారని ఆదోని పట్టణానికి చెందిన రాహుల్ ఫిర్యాదు చేశారు.
ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితుడు