రామగిరి (నల్లగొండ) : సిబ్బంది సంక్షేమమే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తోందని తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్స్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (అదనపు డీజీపీ) సంజయ్ కుమార్ జైన్ అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్రం పరిధిలోని అన్నెపర్తిలో గల 12వ బెటాలియన్లో సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమం, క్రమశిక్షణ, ఆధునికీకరణ, శిక్షణ అనే నాలుగు ప్రధాన సూత్రాలతో బెటాలియన్లు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. 12వ బెటాలియన్ రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన బెటాలియన్గా రూపుదిద్దుకోవాలన్నారు. సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యుల అవసరాలను గుర్తించి, వారి కోసం మెరుగైన వసతులు కల్పించడం అభినందనీయమని కొనియాడారు. కమాండెంట్ కె.వీరయ్య ఆధ్వర్యంలో బెటాలియన్లో ఏర్పాటు చేసిన నూతన ధోబీ రూమ్, ఆధునికీకరించిన యూనిట్ హాస్పిటల్, జిమ్, ఓపెన్ జిమ్, లైబ్రరీ, క్రికెట్ ప్రాక్టీస్ నెట్, మినరల్ వాటర్ ప్లాంట్, చిన్నారుల కోసం ప్రత్యేక ప్లే రూమ్ను ఆయన పారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ శరత్చంద్ర పవార్, అసిస్టెంట్ కమాండెంట్లు నర్సింగ్ వెంకన్న, కె.మహేందర్, టి.సురేష్ బాబు, ఏఓ దయాకర్, మినిస్టీరియల్ స్టాఫ్, సిబ్బంది పాల్గొన్నారు.
ఫ అదనపు డీజీపీ సంజయ్ కుమార్ జైన్


