నల్లగొండ : జిల్లాలో వర్షాభావ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉన్నందున రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. గురువారం నల్లగొండలోని కలెక్టరేట్లో నిర్వహించిన వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత వాతావరణ అంచనాల ప్రకారం ఈ నెలతో పాటు సెప్టెంబర్ తొలి వారంలోనూ తగినంత వర్షపాతం నమోదయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయని, ప్రాజెక్టుల నుంచి సాగునీరు విడుదలయ్యే పరిస్థితులు కూడా కనిపించడం లేదన్నారు. ఈ పరిస్థితుల్లో ఆరుతడి పంటల సాగుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. జిల్లాలో సుమారు 4 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని, వీలైనంత ఎక్కువ విస్తీర్ణంలో ఆయిల్ పామ్ తోటల సాగును ప్రోత్సహించాలన్నారు. ప్రస్తుతం సాగు చేస్తున్న పంటల వివరాల సేకరణను నాలుగు నుంచి ఐదు రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. ఉద్యాన పంటలు, కూరగాయల సాగులో అడవి పందులు, ఇతర వన్యప్రాణుల ఇబ్బందులు తక్కువగా ఉండే పంటలను ప్రోత్సహించాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్, ఉద్యాన శాఖ అధికారి టి.శేఖర్, ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన రోడ్డు భద్రత కమిటీ జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న బ్లాక్ స్పాట్లను గుర్తించి సంబంధిత పోర్టల్లో వెంటనే అప్లోడ్ చేయాలన్నారు. రాత్రి సమయంలో నిలిపే వాహనాలకు రిఫ్లెక్టివ్ టేపులు, హెచ్చరిక లైట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పలు సూచనలు చేశారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ వాహనాలకు పార్కింగ్ స్థలాలను గుర్తించాలన్నారు. రోడ్ సేఫ్టీ కమిటీ ద్వారా ఆక్రమణలను తొలగించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ వాణి, తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


