మిర్యాలగూడ అర్బన్ : ఏరియా ఆస్పత్రికి ఓపీ సంఖ్య కాస్త పెరిగింది. పదిరోజుల క్రితం వరకు 350నుంచి 400 వరకు ఉన్న ఓపీ.. ప్రస్తుతం 430 వరకు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఓపీ కేసుల్లో సాధారణ జ్వరం కేసులతో పాటు జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు ఉంటున్నాయి.
సకాలంలో హాజరుకాని వైద్యులు..
సీజనల్ వ్యాధులు వ్యాపించే ఈ సమయంలో వైద్యులు ఆస్పత్రికి సకాలంలో రావడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. ఇక వైద్య సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో వైద్య పరీక్షల రిపోర్టు కోసం మరుసటి రోజు రావాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. ఏరోజు రిపోర్టు ఆదే రోజు రోగులకు ఇస్తే వెంటనే సంబంధిత డాక్టర్కు చూపించుకుని వైద్యం పొందే వీలుంటుందని రోగులు అంటున్నారు.


