నల్లగొండ : పట్టణంలో శనివారం అర్ధరాత్రి పోలీసులు ప్రత్యేక నాకాబందీ నిర్వహించారు. ఈ ప్రత్యేక డ్రైవ్లో మొత్తం 17 చెకింగ్ పాయింట్ల వద్ద ఏడుగురు సీఐలు, 24 మంది ఎస్ఐ ఆధ్వర్యంలో సుమారు 200 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ తనిఖీల్లో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 91 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. ట్రిపుల్ రైడింగ్ 30, మైనర్ డ్రైవింగ్కు సంబంధించి 9 కేసులు నమోదు చేయడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 4 మోడిఫైడ్ సైలెన్సర్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నంబర్ ప్లేట్లు లేని 73 వాహనాలు, హెల్మెట్ లేకుండా ప్రయాణించిన 97 మంది, సరైన వాహన పత్రాలు లేని 81 మందిపై చట్టపరమైన చర్యలు తీసుకుని మొత్తం 146 వాహనాలను సీజ్ చేశారు. ఇద్దరు అనుమానితులను గుర్తించడంతో పాటు 12 మంది రౌడీషీటర్ల కదలికలను మానిటరింగ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రెండు కార్లకు అమర్చిన బ్లాక్ ఫిల్మ్లను తొలగించారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి 134 ఈ–చలాన్లు, ఇతర ఉల్లంఘనలకు 11 ఈ–పెట్టి కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాల రక్షణే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, మైనర్లతో డ్రైవింగ్ చేయించడం, ట్రిపుల్ రైడింగ్ వంటి ప్రమాదకర చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల భద్రత కోసం ఇటువంటి ప్రత్యేక నాకాబందీ కార్యక్రమాలు జిల్లాలో నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
17 చెకింగ్ పాయింట్లలో 200 మంది పోలీసులతో అర్ధరాత్రి తనిఖీలు
146 వాహనాలు సీజ్
91 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు


