భువనగిరి : ప్రమాదవశాత్తు రైల్లో నుంచి జారిపడి యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం భువనగిరి రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూర్ మండలం సారగండ్లగూడెం గ్రామానికి చెందిన నవీన్(34) ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 10న భార్యా పిల్లలను సొంతూరికి పంపి పని నిమిత్తం వరంగల్కు వెళ్లాడు. అక్కడ పని ముగించుకుని నేరుగా ఊరికి వస్తానని చెప్పాడు. ఈ నెల 11న సాయంత్రం కాజీపేట రైల్వే స్టేషన్లో ఉన్నానని, రైలు కోసం ఎదురుచూస్తున్నట్లు ఫోన్లో భార్యకు ద్వారా చెప్పాడు. ఆదివారం ఉదయం 7.30 గంటల సమయంలో యాదగిరిగుట్ట రైల్వే స్టేషన్, భువనగిరి రైల్వే స్టేషన్ల మధ్య రైల్లో నుంచి జారిపడి మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని భువనగిరిలోని ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడికి భార్య మనీషా, రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
గుర్తుతెలియని వ్యక్తి మృతి
భువనగిరి : రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన భువనగిరి రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున పగిడిపల్లి–భువనగిరి రైల్వే స్టేషన్ల మధ్య సికింద్రాబాద్ నుంచి కాజీపేట వైపు వెళ్తున్న రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి వయస్సు 30 ఏళ్లు ఉంటాయని, పసుపుచ్చ రంగు షర్ట్, నెక్కర్ ధరించి ఉన్నాడని రైల్వే పోలీసులు తెలిపారు. ఎడమ వైపు ఛాతి కింద పుట్టుమచ్చ ఉందన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 98482 22169 నంబర్కు సమాచారం ఇవ్వాలని రైల్వే పోలీసులు సూచించారు.
అంతర్జాతీయ అథ్లెటిక్స్లో మెరిసిన ప్రవళిక
డిండి : మండల కేంద్రానికి చెందిన నారిమళ్ల ప్రవళిక అంతర్జాతీయ అథ్లెటిక్స్లో అద్భుత ప్రతిభ కనబరిచింది. చైనాలోని ఓర్దోస్లో ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు జరిగిన అండర్–23 అంతర్జాతీయ అథ్లెటిక్స్ మహిళల విభాగంలో భారత జట్టు తరఫున రిలే పరుగు పందెంలో ఆమె పాల్గొని బంగారు పతకం సాధించింది. ప్రవళికను దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ తదితరలుఉ అభినందించారు.


