మిర్యాలగూడ టౌన్ : విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు కార్మికులు విద్యుదాఘాతానికి గురయ్యారు. వివరాలు.. మిర్యాలగూడ మండలం శ్రీనివాస్నగర్ సమీపంలోని ఓ వెంచర్లో 14 మంది కార్మికులు విద్యుత్ లైన్ పనులు చేస్తున్నారు. వెంచర్ పక్కనే విద్యుత్ తీగలకు అడ్డొస్తాయనే ఉద్దేశంతో చెట్ల కొమ్మలు కొట్టివేసేందుకు గాను ఆదివారం మధ్యాహ్నం విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అయితే చెట్ల కొమ్మలు కొట్టివేయడం ముగియకుండానే విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి కార్మికులకు చెప్పకుండా కరెంట్ ఆన్ చేశారు. దీంతో పశ్చిమ బెంగాల్కు చెందిన అష్రాఫుల్ మియా, హుస్సేన్ విద్యుదాఘాతానికి గురై స్తంభాల పైనుంచి కిందపడి గాయపడ్డారు. వారిని పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మిగతా 12 మంది కార్మికులు అప్రమత్తం కావడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. విద్యుత్ అధికారుల నిరక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్మికులందరూ మిర్యాలగూడ పట్టణంలోని ఓ విద్యుత్ కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నారు. ఈ మేరకు రూరల్ ఎస్ఐ మల్లికంటి లక్ష్మయ్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
వెంచర్లో చెట్ల కొమ్మలు కొట్టేందుకు విద్యుత్ సరఫరా నిలిపివేత
పని పూర్తికాకుండానే కరెంట్
ఆన్ చేసిన అధికారులు
విద్యుదాఘాతానికి గురై
గాయపడిన వలస కార్మికులు


