వరిలో వెదజల్లే పద్ధతి ద్వారా ఖర్చు ఆదాతో పాటు దిగుబడి ఎక్కువగా వస్తుంది. రైతులు ఒకేసారి నాట్లు వేయడం వల్ల కూలీల కొరత వేధిస్తోంది. దీని వల్ల నాట్లు ఆలస్యమవుతాయి. వెదజల్లే పద్ధతిలో తక్కువ విత్తనాలను అనుకున్న సమయానికి జల్లుకోవచ్చు. రైతులకు ఈ పద్ధతిపై అవగాహన కల్పిస్తున్నాం.
– డి. వెంకటేశ్వర్లు,
వ్యవసాయాధికారి, చివ్వెంల
చివ్వెంల(సూర్యాపేట) : తక్కువ ఖర్చుతో పాటు కూలీల కొరతను అధిగమించేందుకు వరిలో వెదజల్లే పద్ధతిని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై గ్రామాల్లో రైతులకు వ్యవసాయాధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఈ పద్ధతిలో మొలకెత్తిన విత్తనాలను నేరుగా దమ్ము చేసిన పొలంలో వెదజల్లుతారు. దీంతో నారు పోసే, నాటు వేసే ఖర్చు ఆదా అవుతుంది. సాధారణంగా ఎకరాకు నారు పోయడానికి 30 కిలోల విత్తనం వినియోగిస్తుండగా.. వెదజల్లే పద్ధతిలో ఎకరాకు 10 నుంచి 15 కిలోల విత్తనం మాత్రమే అవసరమవుతుంది.
ఎకరాకు రూ.10 వేల వరకు ఆదా..
వెదజల్లే పద్ధతిలో వరి సాగుచేస్తే 7 నుంచి 10 రోజుల ముందుగానే పంట కోతకు వస్తుంది. నారు పెంచడం, నాట్లు వేయించే పనులు ఉండవు కనుక కనీసం ఎకరాకు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు ఖర్చు రైతుకు ఆదా అవుతుంది. 10 నుంచి 15 శాతం దిగుబడి అధికంగా వస్తుంది. ఈ సాగుకు అన్ని నేలలు అనుకూలమే. వెదజల్లే ముందు విత్తనాలను 24 గంటలు మండె కట్టాలి. మొలకెత్తిన తర్వాత దమ్ము చేసిన పొలంలో వెదజల్లాలి. విత్తనం జల్లే ముందు పొలం ఎత్తు వంపులు లేకుండా చూసుకోవాలి. నీరు ఎక్కువగా నిల్వ ఉంచకూడదు.
కలుపు యాజమాన్యం..
కలుపు నివారణకు విత్తిన 3 నుంచి 5 రోజుల మధ్యలో ఫైరజోసల్ఫ్యూరన్ ఇథైలన్ను ఎకరాకు 80 నుంచి 100 గ్రాములు పొలంలో జల్లుకోవాలి. 15 రోజుల తర్వాత ఎరువులు అందించాలి. ఒకవేళ అక్కడక్కడ కలుపు ఉంటే కూలీలచే తీయించాలి. వేర్లను తాకించడం వల్ల మొక్క ఏపుగా పెరుగుతుంది.
ఫ వరిలో వెదజల్లే పద్ధతితో కూలీల
కొరతను అధిగమించవచ్చు


