నల్లగొండ టూటౌన్ : నీలగిరి కార్పొరేషన్లో నల్లా బిల్లుల బకాయిలు భారీగా పేరుకు పోయాయి. 48 డివిజన్లలో మొత్తం 38,658 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ఇళ్లకు నెలకు రూ.100, వాణిజ్య అవసరాలకు రూ. 600 చొప్పున బిల్లులు చెల్లించాల్సి ఉంది. రెండు దశాబ్దాలుగా కుళాయి బిల్లుల వసూలుపై సరైన పర్యవేక్షణ లేక పోవడంతో బకాయిలు భారీగా పేరుకుపోయాయి.
కొరవడిన పర్యవేక్షణ
ప్రతినెలా నల్లా బిల్లులు వసూలు చేయాల్సిన సిబ్బంది పట్టించుకోక పోవడం, అధికారుల పర్యవేక్షణ లేని కారణంగానే బకాయిలు భారీగా పేరుకు పోయాయనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటి వరకు పాత బకా యిలు సుమారు రూ.27 కోట్లు ఉన్నట్లు సమాచారం, ఆన్లైన్ లెక్కల ప్రకారం ప్రతి సంవత్సరం రూ.4 కోట్ల వరకు వసూలు కావాల్సి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.2.10 కోట్ల వరకు( 52.47 శాతం) నల్లా బిల్లులు వసూలయ్యాయి.
బకాయిలపై పట్టింపేది
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బిల్లులను మున్సిపల్ సిబ్బంది వసూలు చేస్తున్నారు. కానీ పాత బకాయిల విషయాన్ని పట్టించుకోవడం లేదు. వాటిని అలాగే వదిలేస్తే ఇక అంతే సంగతులు అయ్యే అవకాశం లేకపోలేదు. కార్పొరేషన్ అందిస్తున్న తాగు నీటిని వినియోగిస్తున్న ప్రజల నుంచి కుళాయి బిల్లులు వసూలు చేయక పోవడం వల్లే పాత బకాయిలు పేరుకు పోయాయనే విమర్శలు ఉన్నాయి. గతంలో నీలగిరిలో 18 వేల లోపు ఉన్న కనెక్షన్లు ప్రస్తుతం రెండింతలయ్యాయి. అయినా ఆదాయం మాత్రం రావడం లేదు. ప్రస్తుత పాలకవర్గం బకాయిలపై ప్రత్యేక దృష్టి పెడితే కార్పొరేషన్ ఖజానా నిండనుంది. మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు కార్పొరేషన్కు రావల్సిన పాత బకాయిల విషయాన్ని విస్మరించారని, కార్పొరేషన్లో పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా అధికారులు బకాయి బిల్లులపై దృష్టి సారిస్తే ఆర్థిక ఇబ్బందులు ఉండవనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఫ నీలగిరి కార్పొరేషన్లో నల్లా బిల్లుల వసూలును పట్టించుకోని అధికారులు, సిబ్బంది
ఫ ఏటా రావాల్సింది రూ.4 కోట్లు
ఫ బకాయిలు రూ. 27 కోట్లు


