
నవరాత్రులను ప్రశాంతంగా జరుపుకోవాలి
ఫ ఎస్పీ శరత్ చంద్ర పవార్
నల్లగొండ : వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అధిక శబ్దం కలిగించే లౌడ్ స్పీకర్లు, డీజేలకు అనుమతి లేదని పేర్కొన్నారు. గణేష్ విగ్రహాల వద్ద నిర్వాహకులు స్పీకర్లను తక్కువ సౌండ్తో రాత్రి 10 గంటల వరకు మాత్రమే వినియోగించాలని తెలిపారు. నిర్వాహకులు మండపం ఏర్పాటు చేసే స్థలం యాజమానుల అనుమతులు తీసుకోవాలని, విద్యుత్ శాఖ అనుమతితోనే కనెక్షన్ తీసుకోవాలని, షార్ట్ సర్క్యూట్ జరుగకుండా నాణ్యత గల వైరు ఉపయోగించాలని, మండపాలు ఉన్న రహదారిలో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూసుకోవాలని, ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలు విధిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మండపాల్లో అనుమానాస్పదంగా బ్యాగులు, ప్లాస్టిక్ సంచులు, వస్తువులు, వ్యక్తులు కనిపిస్తే 100 నంబర్కు సమాచారం అందించాలని పేర్కొన్నారు.
26న జాబ్మేళా
నల్లగొండ : నల్లగొండలోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఈ నెల 26న ఉదయం 10.30 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మేళాలో ఎంపికై న అభ్యర్థులు నల్లగొండ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పని చేయాలని.. నెలకు రూ.10 వేలు నుంచి రూ.25 వేలు వేతనం ఉంటుందని తెలిపారు. ఎస్ఎస్సీ నుంచి డిగ్రీ, డీ,బీ,ఎం.ఫార్మసి విత్ పీసీఐ సర్టిఫికెట్ కోర్సు చదివి ఉండి 18 నుంచి 30 సంవత్సరాల వయసు గల వారు అర్హులని తెలిపారు. పూర్తి వివరాలకు 7893420435 ఫోన్ నంబర్ను సంప్రదించాలని సూచించారు.
అభినవ్ స్టేడియంలో ‘ఈశా’ గ్రామోత్సవం
నల్లగొండ : ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్లగొండలోని మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో శనివారం గ్రామోత్సవం నిర్వహించారు. వివిధ రకాల క్రీడా పోటీలు, సాంస్క్రతిక కార్యక్రమాలు చేపట్టారు. పురుషుల వాలీబాల్లో 15 జట్లు, మహిళల త్రోబాల్లో 10 జట్లు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా గాయత్రి పేరిణి నృత్యం అందర్ని అలరించింది. అనంతరం కోలాటం, సాంస్క్రతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమాల్లో అదనపు ఎస్పీ జి.రమేష్, డిప్యూటీ ఎస్ఓ అక్బర్ అలీ, సతీష్, రామకృష్ణ, విమల, కవిత, శ్రీనివాస్, వెంకట్రామ్రెడ్డి ఉన్నారు.
చెర్వుగట్టులో లక్ష పుష్పార్చన
నార్కట్పల్లి : అమావాస్య సందర్భంగా శనివారం రాత్రి మండలంలోని చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో లక్ష పుష్పార్చన నిర్వహించారు. అమావాస్య కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో విచ్చేశారు. ఎలాంటి ఇబ్బందలుఉ కలగకుండా దేవాలయ శాఖ సిబ్బంది, పోలీసులు తగు చర్యలు తీసుకున్నారు. పూజల్లో ప్రధాన అర్చకులు పోతులపాటి రామలింగేశ్వరశర్మ, సతీష్శర్మ, సురేష్శర్మ, శ్రీకాంత్శర్మ, ఈఓ నవీన్కుమార్ పాల్గొన్నారు.