
పొంగుతున్న వాగులు
రాకపోకలకు అంతరాయం
నల్లగొండ జిల్లాలోని పలు మండలాల్లో వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. పైనుంచి వచ్చిన వరదతో కాలనీలు నీటిమయం అయ్యాయి. పెద్దవూర మండలంలోని పర్వేదుల–పెద్దవూర రహదారిలో కల్వర్టుపై నుంచి చిన్నవాగు పొంగి పొర్లుతోంది. నిడమనూరు, తుమ్మడం చెరువులు అలుగుపోస్తున్నాయి. బంకాపురం–నిడమనూరు మధ్యలో వర్షపు నీటి కారణంగా లోలెవల్ కల్వర్టు దెబ్బతింది. దానిపై మూడు అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. దీంతో రహదారిపై రాకపోకలు బంద్ చేశారు. చండూరు మండలం చామలపల్లి వాగు, నాంపల్లి మండలం శశిలేటి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కొండమల్లేపల్లి మండలం అబ్బనోనిగూడెం నుంచి వర్షపు నీరు గౌరీకుంటతండాకు చెందిన ఇళ్లల్లోకి చేరింది. దీంతో వారంతా రెండు రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేములపల్లి మండలంలో ఆమనగలు చెరువు అలుగుపోస్తోంది. భీమారం – సూర్యాపేట మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అడవిదేవులపల్లి – మిర్యాలగూడ మధ్య రామన్నపేట వాగు పొంగి పొర్లడంతో రాకపోకలు స్తంభించాయి.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రెండు రోజులుగా కురుస్తున్న వర్షం ఉమ్మడి జిల్లాను ముంచెత్తింది. అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్ల మీదుగా వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. పట్టణ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నల్లగొండ జిల్లాలోని దామరచర్లలో 77.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈ సీజన్లో ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 250.8 మిల్లీమీటర్లు కురువాల్సి ఉండగా, ఇప్పటికే 339.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇక సూర్యాపేట జిల్లాలోని పాలకీడులో 114.7 మిల్లీమీటర్ల వర్షం పడింది. సూర్యాపేట జిల్లాలో ఈ సీజన్లో 326 మిల్లీమీటర్ల వర్షం పడాల్సి ఉండగా, ఇప్పటికే 402 మిల్లీమీటర్ల వర్షం పడింది.
సూర్యాపేట జిల్లాలో బీభత్సం..
సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూర్(ఎస్) మండలంలోని చెరువులన్నీ అలుగు పోస్తున్నాయి. ఏపూరు వద్ద బిక్కేర్ వాగుపై వరద ప్రభావం ఎక్కువగా ఉండటంతో మంగళవారం నుంచి రాకపోకలు నిలిపివేశారు. తుమ్మల పెన్పహాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కురుస్తుండడంతో ఈరోజు పాఠశాలకు సెలవు ప్రకటించారు. చివ్వెంల మండలంలో కురుస్తున్న వర్షాలకు చెరువుల్లోకి నీరు వచ్చాయి, ఆత్మకూరు ఎస్ మండలం పాతసూర్యాపేటలో వర్షం కారణంగా విద్యుత్తు షార్ట్ సర్క్యూట్లో ఇల్లు కాలిపోయింది. తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో ఇళ్లల్లోకి నీరు చేరి వస్తువులు తడవడంతో రెండు రోజులుగా బాధితులకు అధికారులు భోజనాలు అందిస్తున్నారు. చింతలపాలెం మండలం కిష్టాపురం వద్ద చింత్రియాల మేజర్ (ఎన్ఎస్పీ) కాలువ తెగిపోయింది. దీంతో పంటలు నీటమునిగాయి.
పిల్లలను బస్సులో పంపించిన పేట కలెక్టర్
మఠంపల్లి మండలంలో రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి మఠంపల్లి, చౌటపల్లి ఊర చెరువులు అలుగు పోస్తున్నాయి. దీంతో రాకపోకలను నిలిపివేశారు. మఠంపల్లి మోడల్ స్కూల్ నుంచి 11 మంది విద్యార్థులు ఆటోలో రఘునాథపాలెం వెళ్తుండగా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ చూసి తన కారులో స్కూల్ వద్దకు తీసుకువచ్చి, ప్రత్యేక బస్సులో వారిని ఇళ్లకు పంపించారు.
ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ
యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి, బీబీనగర్, వలిగొండ మండలాల మీదుగా మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. బీమలింగం, రుద్రవెళ్లి వద్ద లోలెవల్ బ్రిడ్జిల పైనుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. ఆత్మకూరు(ఎం) మండలంలో బిక్కెరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పరిసర గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఫ గ్రామాలకు రాకపోకలు బంద్
ఫ లోతట్టు ప్రాంతాలు జలమయం
ఫ విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో కాలిపోయిన ఇల్లు
ఫ పాలకీడు, దామరచర్ల మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదు

పొంగుతున్న వాగులు