
భూముల రక్షణకే.. ‘భూ భారతి’
మిర్యాలగూడ : భూముల రక్షణ కోసమే భూభారతి చట్టాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం మిర్యాలగూడ నియోజకవర్గంలోని అడవిదేవులపల్లి, దామరచర్ల, మిర్యాలగూడ, వేములపల్లిలో భూభారతి చట్టంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుల్లో ఆమె ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్నాయక్తో కలిసి మాట్లాడారు. భూ భారతి చట్టంతో రైతులకు మేలు జరుగుతుందని గతంలో ధరణిలో ఉన్న సమస్యలన్నింటికి ఈ భూభారతి చట్టంతో పరిష్కారం లభిస్తుందని తెలిపారు. దాదాపు 80శాతం భూ సమస్యలు తహసీల్దార్ స్థాయిలోనే పరిష్కారమవుతాయని తెలిపారు. గతంలో ఏదైనా సమస్య వస్తే ధరణిలో సవరణలు చేయడం చాలా కష్టతరంగా ఉండేదని.. ఇప్పుడు తప్పు జరుగిన చోటే సవరించే అధికారం ప్రభుత్వం ఇవ్వడం శుభపరిణామమన్నారు. భూ ఆధార్ ద్వారా అన్ని సక్రమంగా అమలు చేసేందుకు పాస్బుక్లో పట్టాదారు పూర్తి వివరాలతో పాటు నక్ష ఉండడం వల్ల భూమికి భద్రత ఉంటుందని తెలిపారు. చాలా గ్రామాల్లో రెవెన్యూ యంత్రాంగం లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు వచ్చాయని.. త్వరలోనే గ్రామ పాలన అందుబాటులో వస్తుందన్నారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని కానీ, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వెనుకబడి ఉన్నామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసే కార్యకర్తను విస్మరించదన్నారు. ఎమ్మెల్సీ కేతావత్ శంకర్నాయక్ మాట్లాడుతూ గత పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేసి తెలంగాణను అప్పులపాలు చేసిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యూసుఫ్అలీ, రెవెన్యూ సిబ్బంది సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు నూకల వేణుగోపాల్రెడ్డి, బండి యాదగిరిరెడ్డి, ముదిరెడ్డి నర్సిరెడ్డి, ఇజ్రాయిల్ తదితరులు పాల్గొన్నారు.
పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ
మిర్యాలగూడ మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో 80 మంది పేదలకు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్నాయక్, కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తోందన్నారు. పేదలకు పట్టాలు ఇచ్చిన స్థలంలోనే ఇందిరమ్మ ఇళ్లను సైతం నిర్మించి ఇస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నారాయణ్అమిత్, తహసీల్దార్ హరిబాబు తదితరులు ఉన్నారు.

భూముల రక్షణకే.. ‘భూ భారతి’