
శిక్షణ కార్యక్రమానికి హాజరైన అధికారులు
నల్లగొండ : అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వి.కర్ణన్ అధికారులను కోరారు. శనివారం కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో ఓట్ల లెక్కింపుపై అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు కౌంటింగ్ అబ్జర్వర్లు ప్రతిపాల్ చౌహాన్, ఆర్.మనుల్రాజ్, జైనేంద్రసింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆదివారం ఉదయం 8 గంటలకు తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లిలో గల గోదాముల్లో జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ముందస్తుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. ప్రతి నియోజకవర్గానికి 14 కౌంటింగ్ టేబుల్లు, ఒక పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు టేబుల్ ఏర్పాటు చేశామన్నారు. ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ విధులు నిర్వహిస్తారని, ప్రతి నియోజకవర్గానికి రిజర్వ్ బృందాలు, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు బృందాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఏదేని సమస్య తలెత్తితే రిటర్నింగ్ అధికారికి తెలియజేయాలన్నారు. మైక్రో అబ్జర్వర్లు కౌంటింగ్ ప్రక్రియను గమనించాలని, ఎలాంటి సమస్య రాకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రతి రౌండ్లో ఓట్ల వివరాలు ఆర్వోకు అందేలా చూడాలన్నారు. కౌంటింగ్ ఏజెంట్లకు రిజల్ట్స్ చూపించి సంతకాలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారి హేమంత్ కేశవ్ పాటిల్, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రామిక్, నోడల్ ఆఫీసర్లు వెంకయ్య, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఆర్వి.కర్ణన్
ఫ ఓట్ల లెక్కింపుపై వివిధ శాఖల అధికారులకు శిక్షణ
కౌంటింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి
నల్లగొండ : ఓట్ల లెక్కింపునకు అవసరమైన సిబ్బంది తుది ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వి.కర్ణన్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఓట్ల లెక్కింపు పరిశీలకులు ప్రతిపాల్ చౌహాన్, ఆర్.మనుల్రాజ్, జైనేంద్రసింగ్ సమక్షంలో ర్యాండమైజ్ ప్రక్రియ పూర్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నియోజకవర్గానికి 132 మంది కౌంటింగ్ సూపర్ వైజర్స్, 132 మంది కౌంటింగ్ అసిస్టెంట్స్, 132 మంది మైక్రో అబ్జర్వర్స్ను కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారులు జె.శ్రీనివాస్, రవి, చెన్నయ్య, శ్రీరాములు, దామోదర్, తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ కర్ణన్