● నోటీసుల జారీ నుంచి విచారణ
వరకు గందరగోళం
● సామాన్య ఓటర్లకు తప్పని తిప్పలు
● నేటి నుంచి రెండో విడత
మెగా హియరింగ్
● ఆధార్తో పాటు మరో పత్రం
సమర్పించాల్సిందే..
జిల్లాలోని నాగర్కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి నియోజకవర్గాల్లో ఇటీవల విడుదల చేసిన ముసాయిదా జాబితా ప్రకారం 8,35,482 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,65,552 మంది ఓటర్ల వివరాలు అనామలీస్ కేటగిరీలో ఉన్నాయి. మరో 15,563 మంది అన్మ్యాపింగ్ ఓటర్లు ఉన్నారు. ఈ రెండు కేటగిరీల ఓటర్లు మొత్తం 1,81,115 మందికి నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటికే 90 శాతానికి పైగా నోటీసులు జారీ పూర్తయ్యాయి. ప్రతి ఓటరు వివరాలను బీఎల్ఓల నుంచి రిటర్నింగ్ అధికారి, ఎన్నికల సిబ్బంది, జిల్లా ఎన్నికల అధికారి వరకు పరిశీలన చేయాల్సి ఉంది. ఇందుకోసం మెగా హియరింగ్ నిర్వహణలో అధికారులు నిమగ్నమయ్యారు. కాగా, అన్మ్యాప్డ్ ఓటర్లు, వివరాలు సరిగ్గా లేని ఓటర్ల జాబితాను ఈ నెల 8న ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వెబ్సైట్ https://-cŠ-obèlte langana.nic.in లో ఈ జాబితాను అందుబాటులో ఉంచారు.
అచ్చంపేట: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో ఓటర్లకు తిప్పలు తప్పడం లేదు. అనామలీస్, అన్మ్యాప్డ్ ఓటర్లు నోటీసుల జారీ నుంచి విచారణ వరకు గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. జిల్లాలో 1,81,115 మంది ఓటర్ల వివరాలు సరిగ్గా లేవు. వారందరికీ నోటీసులను జారీ చేస్తున్నారు. జిల్లా నుంచి విద్య, ఉద్యోగ, ఉపాధి తదితర కారణాలతో వేర్వేరు చోట్లకు వలసలు వెళ్లారు. అయినా చాలా మంది ఓటు హక్కు స్థానికంగానే కొనసాగుతోంది. ఓటరు మ్యాపింగ్ సమయంలో పేరు, తల్లిదండ్రుల పేర్లు, అడ్రస్, వయసు, లింగం వివరాల్లో తప్పిదాలు దొర్లాయి. వీరు ఆన్లైన్లో వివరాలను ఆప్లోడ్ చేసే క్రమంలో యాప్ తీసుకోవడం లేదు. దీంతో నోటీసులు అందుకున్న ఓటర్లంరూ తప్పనిసరిగా స్పందించాల్సి ఉంది. సరైన రుజువు చూపిస్తేనే తుది జాబితాలో చోటు దక్కుతుంది. అయితే చాలా మంది ఓటర్లకు నోటీసులు అందుతున్నా బీఎల్వోలు, అధికారుల వద్దకు హియరింగ్ కోసం నిర్ణీత సమయంలో రావడం లేదు. ఇప్పటికే ఈ నెల 5, 6 తేదీల్లో మొదటి విడత మెగా హియరింగ్ పూర్తయింది. 12, 13 తేదీల్లో రెండో విడత మెగా హియరింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.
ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు..
ఓటర్ల నమోదు, తొలగింపు, వివరాల సేకరణకు సంబంధించి ఫారం–6, 7, 8 దరఖాస్తులపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 12, 13 తేదీల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఓటర్లకు నోటీసుల జనరేషన్, విచారణ పురోగతిని రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించనున్నారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు తుది ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అదే సమయంలో అర్హత లేని, మరణించిన, ఇతర కారణాలతో తొలగించాల్సిన పేర్లను నిబంధనల ప్రకారం పరిశీలన చేయనున్నారు.


