కందనూలు: ఆర్టీసీ ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు శనివారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ యాదయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నాగర్కర్నూల్ డిపో పరిధిలోని ప్రయాణికులు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఫోన్ నంబర్ 99592 26288 ను సంప్రదించి రవాణా సమస్యలు తెలియజేయడంతోపాటు ఆర్టీసీ అభివృద్ధికి సలహాలు, సూచనలు అందించాలని ఆయన కోరారు.
మౌలిక వసతుల
కల్పనకు ప్రాధాన్యం
నాగర్కర్నూల్ రూరల్: మండలంలోని పెద్దముద్దునూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎంపీపీఎస్ పాఠశాలను చిన్నజీయర్ స్వామి ఎమ్మెల్యే రాజేష్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విద్యారంగంలో మౌళిక వసతుల మెరుగుదలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణరావు, మున్సిపల్ చైర్మన్ సునేంద్ర, కౌన్సిలర్లు, మండల అధ్యక్షుడు పాల్గొన్నారు.
పేదల సంక్షేమమే
ప్రభుత్వ లక్ష్యం
అచ్చంపేట రూరల్: పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటు పడుతోందని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకు సీఎం సహాయ నిధి ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.
విద్యాసంస్థల
బంద్ ప్రశాంతం
కందనూలు: నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా వామపక్షాల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన విద్యాసంస్థల బంద్ విజయవంతం అయిందని ఆ సంఘం నాయకులు తెలిపారు. జిల్లా కేంద్రంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ కూడలిలో విద్యార్థులను ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీకేజీకి కారణమైన వారిని ప్రభుత్వం వెంటనే అరెస్టు చేసి ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయ కులు తారాసింగ్, వంశీ, శివప్రసాద్, అరుణ్, రామకృష్ణ, కురుమయ్య పాల్గొన్నారు.
8, 9 తేదీల్లో
సాహిత్య సదస్సు
స్టేషన్ మహబూబ్నగర్: తెలంగాణ సాహితీ దిగ్గజం ఆచార్య పాకాల యశోదారెడ్డి జయంతిని పురస్కరించుకొని నగరంలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ పాలమూరు ఆధ్వర్యంలో వచ్చే నెల 8, 9 తేదీల్లో సాహిత్య సదస్సు నిర్వహిస్తున్నట్లు మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు రావూరి వనజ, జి.శాంతారెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఆచార్య పాకాల యశోదారెడ్డి సమగ్ర సాహిత్యం అనే అంశంపై రెండురోజులపాటు సాహిత్య సదస్సు ఉంటుందన్నారు. ఆచార్య పాకాల యశోదారెడ్డి సమగ్ర సాహిత్యంపై పరిశోధనలు సమర్పించాలనుకున్న సాహితీవేత్తలు, పరిశోధకులు తమ పేర్లను నమోదు చేసుకొని పత్రాలను ముందస్తుగా సంస్థకు పంపించాలని కోరారు.


