కందనూలు: రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ హేమంతకేశవ్ పాటిల్ వ్యవసాయాధికారులకు సూచించారు. శుక్రవారం ఐడీఓసీ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎల్నినో, వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయంపై ప్రభావం, భూగర్భ జలాల లభ్యత, నీటి సంరక్షణ చర్యలు, ప్రత్యామ్నాయ పంటల సాగు తదితర అంశాలపై జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావాన్ని తేలికగా తీసుకోకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ వర్షాభావానికి గురయ్యే మండలాలు, గ్రామాలను ముందుగానే గుర్తించి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. అధిక నీరు అవసరమయ్యే వరి వంటి పంటలకు బదులుగా పత్తి, కందులు, మినుములు, పెసలు, ఉలవలు, జొన్నలు, సజ్జలు, రాగులు, ఇతర చిరుధాన్యాలు, ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. ప్రత్యామ్నాయ పంటలకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, నాణ్యమైన విత్తనాలు, పంటల బీమా, మార్కెటింగ్ అవకాశాలు, కనీస మద్దతు ధరలపై గ్రామస్థాయిలో విసృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో నీటి వృథాను అరికట్టేందుకు ‘జల ప్రతిజ్ఞ’ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు దేవ సహాయం, చెన్నయ్య, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.


