
పొదుపుతో భద్రత
మొదలైన కార్యాచరణ
అర్హులను గుర్తిస్తున్నాం..
దివ్యాంగులంతా..
● 15 నుంచి 18 ఏళ్ల వయసున్న
బాలికలు, 60ఏళ్లు నిండిన
మహిళలతో ప్రత్యేక గ్రూపులు
● బ్యాంక్ లింకేజీ రుణాలు
● కొనసాగుతున్న అర్హుల
గుర్తింపు ప్రక్రియ
● నెలాఖరులోగా సంఘాల ఏర్పాటు, సభ్యులకు బ్యాంకు ఖాతాలు
అచ్చంపేట: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో వారిని స్వయం సహాయక సంఘాల నెట్వర్క్ పరిధిలోకి తీసుకొచ్చే ఉద్దేశంతో ఇందిరా మహిళా శక్తి మిషన్–2025ను ప్రకటించింది. ఇందులో భాగంగా 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న బాలికలతో పాటు 60 ఏళ్లు నిండిన మహిళలు, దివ్యాంగులతో స్వయం సహాయక సంఘాలను ఈ నెలాఖరులోగా ఏర్పాటు చేసేలా సెర్ఫ్ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
బ్యాంకింగ్ లావాదేవీలపై అవగాహన
15 నుంచి 18 ఏళ్ల వయస్సున్న కిశోర బాలికలతో స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసి డబ్బు పొదుపు, బ్యాంకింగ్ లావాదేవీలపై అవగాహన కల్పించనున్నారు. దీంతో పాటు హ్యుమన్ ట్రాఫికింగ్, మహిళలపై వేధింపులు, సోషల్ మీడియా ద్వారా జరిగే మోసాలు, విద్య, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పిస్తారు. సంఘాల్లో కిశోర బాలికలను చేర్పించేందుకు సెర్ఫ్ అధికారులు, సిబ్బంది ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.
60 ఏళ్లు దాటిన మహిళలకు మళ్లీ అవకాశం
ప్రస్తుతం ఉన్న స్వయం సహాయక సంఘాల్లో 60 ఏళ్లు నిండిన వారిని తొలగిస్తున్నారు. కానీ కొత్త పాలసీలో వీరితో మళ్లీ సంఘాలు ఏర్పాటు చేయనున్నారు. ఏ ఆసరా లేని మహిళలకు వృద్ధాప్యంలో చిరు వ్యాపారాలు చేసుకుని బతికేందుకు సాయం చేయడం, నలుగురిలో సంఘటితం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.
నూతన స్వయం సహాయక సంఘాల ఏర్పాటుకు ఈ నెల 12 నుంచి కార్యాచరణ చేపట్టారు. ఇందులో భాగంగా 15 నుంచి 18 ఏళ్ల వయస్సు గల బాలికలు, సంఘాల్లో లేని వృద్ధులు, దివ్యాంగులను గుర్తిస్తున్నారు. డీపీఎం, సీపీలు, సిబ్బంది ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. సంఘాల్లో చేరితే కలిగే ప్రయోజనాల గురించి వివరిస్తున్నారు. ఈ నెల 31వ తేదీ వరకు సంఘాలు ఏర్పాటు చేసి సభ్యులతో బ్యాంకు ఖాతాలు తెరిపించనున్నారు. అనంతరం సెర్ఫ్ వెబ్సైట్లో నమోదు చేయనున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 13,239 మహిళా సంఘాలు ఉండగా వాటిలో 1,47,123 మంది సభ్యులు ఉన్నారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కిశోర బాలికలు, దివ్యాంగులు, వృద్ధులను గుర్తిస్తున్నాం. జిల్లాలో 20వేల మందిని చేర్చేందుకు టార్గెట్ ఉండగా.. ఇప్పటి వరకు 5,246 మందిని గుర్తించగా ఇందులో 60ఏళ్ల వయస్సు దాటిన వారు 2,315 మంది, దివ్యాంగులు 684 మంది ఉన్నారు. ఈ నెలాఖరు నాటికి టార్గెట్ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సంఘాల్లో చేరితే కలిగే ప్రయోజనాలపై వారికి అవగాహన కల్పిస్తున్నాం.
– ఓబులేష్, డీఆర్డీఓ
దివ్యాంగులందరినీ ఒకే గొడుగు కిందకి తీసుకరానున్నారు. ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాల్లో మహిళలతో పాటు పురుషులు కూడా సభ్యులుగా ఉండనున్నారు. మహిళా సంఘాలకు ఇచ్చిన మాదిరిగానే దివ్యాంగులకు కూడా వ్యాపారాలు చేసుకునేందుకు బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు ఇవ్వనున్నారు. ప్రతి సంఘంలో 7 నుంచి 10 మంది ఉంటారు.

పొదుపుతో భద్రత

పొదుపుతో భద్రత