ఓర్వలేకనే రాహుల్‌పై మోదీ కుట్రలు

మాట్లాడుతున్న నాగం జనార్దన్‌రెడ్డి  - Sakshi

కందనూలు: భారత్‌ జోడో యాత్రతో రాహుల్‌గాంధీకి వచ్చిన ఆదరణను చూసి ఓర్వలేకనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ కుట్రపూరితంగా పార్లమెంట్‌ సభ్యత్వాన్ని రద్దు చేశారని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని గాంధీ పార్క్‌లో నాగం శశిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సత్యాగ్రహ సంకల్ప దీక్షలో ఆయన డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణతో కలిసి పాల్గొని మాట్లాడారు. ఆరోపణలను ఆసరాగా తీసుకుని ఇష్టారీతిగా వ్యవహరించడం సరికాదన్నారు. న్యాయ వ్యవస్థ, గవర్నర్‌, ఎన్నికల కమిషన్‌ వంటి రాజ్యాంగబద్ధ సంస్థలను బీజేపీ నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు అవకాశం ఉన్నా.. పార్లమెంట్‌ ఉత్తర్వులు జారీ చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అదానీ అక్రమ సంపాదనపై ప్రతిపక్షాలు నిలదీస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. వంశీకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నో త్యాగాలు చేసి దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిందన్నారు. బీజేపీ ప్రజలకు చేసిందేమీ లేదని, పెద్దనోట్ల రద్దు, జీఎస్టీతో పేదలపై పెనుభారం మోపారని విమర్శించారు. ఎన్నో త్యాగాలకు సిద్ధపడిన గాంధీ కుటుంబంపై కుట్ర పూర్వకంగా ప్రజల ముందు దోషులుగా నిలబెట్టేందుకు నరేంద్రమోదీ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అర్థం రవి, పీసీసీ సభ్యుడు బాలగౌడ్‌, తెలకపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు సుమిత్ర, మున్సిపాలిటీ అధ్యక్షుడు పాండు, ఆయా మండలాల అధ్యక్షులు లక్ష్మయ్య, సుహాసన్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Nagarkurnool News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top