పకడ్బందీగా ‘పది’ ప్రశ్నపత్రాల తరలింపు
కందనూలు: వచ్చే నెల 3వ తేది నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్ష ప్రశ్నపత్రాలను శనివారం ఎస్పీ కార్యాలయం నుంచి జిల్లాలోని 18 పోలీస్ స్టేషన్లకు పోలీస్ బందోబస్తు మధ్య తరలించారు. శుక్రవారం హైద్రాబాద్ నుంచి నేరుగా జిల్లా ఎస్పీ కార్యాలయానికి ప్రశ్నపత్రాలు చేరుకోగా, స్ట్రాంగ్ రూంలో భద్రపర్చారు. శనివారం డీఈఓ గోవిందరాజులు, ప్రభుత్వ పరీక్షల నిర్వహణ అధికారి రాజశేఖర్రావు నేతృత్వంలో పోలీసు, రెవెన్యూ అధికారుల సమక్షంలో తరలింపు నిర్వహించారు. జిల్లాలోని 61 పరీక్ష కేంద్రాలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను 18 పోలీస్స్టేషన్లకు తరలించి ఆయా స్ట్రాంగ్ రూంలలో భద్రపరచనున్నట్లు డీఈఓ వెల్లడించారు. ఏ సబ్జెక్టు పరీక్ష రోజు ఆ ప్రశ్నపత్రాలను మాత్రమే ఉదయం 8.30గంటలకు పోలీస్ స్టేషన్ స్ట్రాంగ్ రూం నుంచి పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు పోలీసు బందోబస్తు మధ్య పరీక్ష కేంద్రాలకు పేపర్లను తరలించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ పరీక్షల నిర్వహణ అధికారి రాజశేఖర్ రావు, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ నాగరాజు, రూట్ అధికారులు శంకర్ నాయక్, భాస్కర్రెడ్డి, వెంకటయ్య, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.