ఏసీబీకి పట్టుబడుతున్న
పలువురు అధికారులు
ములుగు: ప్రభుత్వ కార్యాలయాల గడప తొక్కే సామాన్యుడికి తన పని సకాలంలో, ఎలాంటి అదనపు భారం లేకుండా పూర్తవుతుందనే నమ్మకం లేకుండాపోయింది. ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ అభివృద్ధికి పాటుపడాల్సిన అధికార యంత్రాంగం ముడుపుల కోసం చేతులు చాపుతుండడంతో ప్రజలు ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తున్నారు. ఫిర్యాదులు అందుకున్న ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి వారిని రెడ్హ్యాండెడ్గా పట్టుకోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారుతోంది. 2023 నుంచి ఇప్పటివరకు జిల్లాలో పలు శాఖలకు చెందిన అధికారులు ఏసీబీకి చిక్కినా... చలనం ఉండడం లేదు. ఇప్పటివరకు వివిధ శాఖలకు చెందిన 8 మంది అధికారులు ఏసీబీకి పట్టుబడడం జిల్లాలో కలకలం రేపుతుంది. లంచగొండి అధికారులపై కొ రఢా ఝూలిపించాల్సిన ఉన్నతాధికారులు మౌనం వహిస్తుండడంతో లంచగొండి అధికారులే రాజ్యమేలుతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. తాజాగా శుక్రవారం గోవిందరావుపేట తహసీల్దార్ రూ.14 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.
2019లో జిల్లా ఏర్పాటు అయ్యాక తొలిసారిగా 2023 జనవరి 20న ఏటూరునాగారం ఐటీడీఏలో పనిచేసే డీఈఈ నవీన్కుమార్, ఏఈఈ అబీద్ఖాన్లు కాంట్రాక్టర్ నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. 40 రోజులు గడవక ముందే 2023 ఫిబ్రవరి 27న ఏటూరునాగారం తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే ఔట్ సోర్సింగ్ సర్వేయర్ మహేందర్ భూ సర్వే విషయంలో రైతు నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.
2025 మే 6న జిల్లా పరిషత్ కార్యాలయంలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న సుధాకర్, జూనియర్ అసిస్టెంట్ సౌమ్యారెడ్డి ఏసీబీ ట్రాప్లో పడ్డారు. మెడికల్ లీవ్ కాలానికి సంబంధించిన రూ.3.50 లక్షల జీతం బిల్లులను తయారు చేసి ట్రెజరీకి పంపేందుకు రూ.60 వేల లంచం డిమాండ్ చేయగా, రూ.25 వేలు లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
2025 జూన్ 16న డీఈఓ కార్యాలయంలో మరో ట్రాప్ జరిగింది. డీఈఓ పాణిని, జూనియర్ అసిస్టెంట్ దిలీప్కుమార్లు ఉపాధ్యాయుడి జాయినింగ్ రిపోర్టును స్వీకరించి తిరిగి విధుల్లో చేరేందుకు లంచం డిమాండ్ చేయగా, జూనియర్ అసిస్టెంట్ దిలీప్కుమార్ రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
తాజాగా శుక్రవారం గోవిందరావుపేట తహసీల్దార్, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ సృజన్కుమార్ రూ.14 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. వారసత్వ వ్యవసాయ భూమికి సంబంధించిన వ్యవహారంలో అధికారిక అనుకూలత కల్పించేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది. ఫిర్యాదు అందడంతో అధికారులు పథకం ప్రకారం ట్రాప్ నిర్వహించి కార్యాలయంలోనే డబ్బులు తీ సుకుంటున్న సమయంలో పట్టుకున్నారు. లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
తాజాగా గోవిందరావుపేట
తహసీల్దార్ అరెస్ట్
ఇప్పటివరకు 8 మంది ట్రాప్


