గోవిందరావుపేట: రైతుల భూ సమస్యలకు పరి ష్కారం చూపాల్సిన తహసీల్దార్ కార్యాలయం లంచాలకు కేంద్రంగా మారిందనే ఆరోపణలు వె ల్లువెత్తుతున్నాయి. ప్రతీ పనికి లంచం అడుగుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. తండ్రి మరణంతో వారసత్వంగా వచ్చిన 1.10 ఎకరాల భూమిని తన పేరున పట్టా చేయించుకునేందుకు చల్వాయికి చెందిన ఓ మహిళ నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేదు. దీంతో బాధితురాలి భర్త ఏసీబీని ఆశ్రయించడం.. గో విందరావుపేట తహసీల్దార్ సృజన్కుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరకడం కలకలం రేపింది.
కార్యాలయం ఉన్నా..లేకపోయినా.. ఒకటే
ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్న విషయం తెలియని వివిధ గ్రామాలకు చెందిన కొందరు రైతులు తమ పనుల నిమిత్తం అదే సమయంలో తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. తమ పనులు సకాలంలో జరగడం లేదని, పైసలిస్తేనే కార్యాలయంలో పనులు చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యాలయం ఉన్నా.. లేకపోయినా ఒకటే.. అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో బయటకు వచ్చిన ఏసీబీ డీఎస్పీ సాంబయ్యకు ఈ విషయం తెలియడం, ఏసీబీ దాడులు జరుగుతున్న సంగతి తెలియకుండానే రైతులు తమ సమస్యలను బయటపెట్టడం అధికారులను విస్మయానికి గురి చేసింది.


