ములుగు: లొంగిపోయిన మావోయిస్టుల పునరావాసానికి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులందరికీ పునరావాస ప్రయోజనాలు కల్పించాలని కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో లొంగిపోయిన మావోయిస్టుల పునరావాసానికి సంబంధించి జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని కలెక్టర్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పోతో కలిసి బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆర్థికసాయం, ఇంటి స్థలాలు, వ్యవసాయ భూములు, ఉపాధి అవకాశాలు తదితర పునరావాస ప్రయోజనాలు కల్పించే అంశాలపై సమగ్రంగా చర్చించారు. పెండింగ్లో ఉన్న అంశాలను పరిశీలించి, అవసరమైన తదుపరి చర్యలపై నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులకు పునరావాస ప్రయోజనాలు సకాలంలో అందేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మహేందర్ జీ, డీఎస్పీ రవీందర్, జిల్లా అధికారులు రామ్మోహన్, రవీందర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు


