● కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు
ములుగు: భారత రెడ్క్రాస్ సొసైటీ జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ ఎన్నికలను నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్, జిల్లా రెడ్క్రాస్ సొసైటీ అధ్యక్షుడు భోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. రాష్ట్ర రెడ్క్రాస్ సొసైటీ ఆదేశాల మేరకు జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ ఎన్నికలను అక్టోబర్ 4న నిర్వహించేందుకు కలెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించాలని సూచించారు. ఈ మేరకు ఎన్నికల అధికారిగా ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు ధర్మనాయక్ను, ఎన్నికల పరిశీలకుడిగా అదనపు కలెక్టర్ సంపత్రావును నియమించినట్లు తెలిపారు. ఈ నెల 19న తుది ఓటర్ల జాబితాతో పాటు ఎన్నికల ప్రకటన విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. 24న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నామినేషన్లు స్వీకరిస్తారని, ఒక్కో నామినేషన్కు తిరిగి చెల్లించని డిపాజిట్గా రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. 25న నామినేషన్ల పరిశీలన, 26న ఉపసంహరణ ప్రక్రియ నిర్వహించి అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారని వెల్లడించారు. అవసరమైతే అక్టోబర్ 4న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ నిర్వహించి సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నట్లు వెల్లడించారు. అనంతరం జిల్లా శాఖ చైర్మన్, వైస్ చైర్మన్, కోశాధికారి, రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యుడి ఎన్నికను అదేరోజు నిర్వహిస్తారని కలెక్టర్ వివరించారు.


