● డీఎంహెచ్ఓ గోపాల్రావు
గోవిందరావుపేట: పిల్లల్లో కంటి సమస్యలు తొలిదశలోనే గుర్తించి తగిన వైద్యం అందించేందుకు తప్పనిసరిగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి గోపాల్రావు తెలిపారు. కమిషనర్ ఆఫ్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆదేశాల మేరకు జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమాన్ని మంగళవారం మండల పరిధిలోని చల్వాయి మోడల్ స్కూల్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని, కంటి ఆరోగ్యంపై ప్రతిఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. జిల్లాలోని 29,512 మంది బాలబాలికలకు కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో 14,604 మంది బాలురు, 14,908 మంది బాలికలు ఉన్నారని తెలిపారు. జిల్లాలోని ఆరు ఆర్బీఎస్కే బృందాల ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు. పిల్లలకు విటమిన్–ఏ సమృద్ధిగా లభించే క్యారెట్, గుడ్లు, పాలు, ఆకుకూరలు తీసుకోవాలని సూచించారు. వీటిని తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడటంతో పాటు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో 250 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించినట్లు జిల్లా కార్యక్రమ అధికారి డాక్టర్ నాగఅన్వేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాస్ మీడియా అధికారి సంపత్, ఆర్బీఎస్కే వైద్యులు శ్రీనివాస్, డాక్టర్ జయప్రద, నేత్ర పరీక్షాధికారి తిరుపతి, మోడల్ స్కూల్ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ రాంచందర్, ఆర్బీఎస్కే బృందం సభ్యులు పాల్గొన్నారు.


