ములుగు: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా అర్హులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణవేణి సూచించారు. ములుగు, మల్లంపల్లి, వెంకటాపురం(ఎం) మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను ఆర్డీఓ శనివారం తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రాల్లో బూత్స్థాయి అధికారుల అందుబాటు, ఓటర్ల నుంచి స్వీకరిస్తున్న దరఖాస్తులు, క్లెయిమ్స్, అభ్యంతరాల నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా బూత్ స్థాయి అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. కొత్తగా ఓటరు నమోదుకు ఫారం–6, పేర్ల తొలగింపునకు ఫారం–7, వివరాల సవరణకు ఫారం–8 దరఖాస్తులను స్వీకరించాలని సూచించారు. ఓటర్ల నుంచి అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని తెలిపారు. ప్రత్యేక ప్రచార దినాల్లో బూత్ స్థాయి అధికారులు సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉండి ఓటర్లకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ములుగు తహసీల్దార్ ఎన్. విజయభాస్కర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ నగేశ్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, రాజేందర్, జూనియర్ అసిస్టెంట్ సాత్విక్, బూత్ స్థాయి అధికారులు, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల నమోదు అధికారి,
ఆర్డీఓ కృష్ణవేణి


