వెంకటాపురం(ఎం): ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామప్ప దేవాలయంలో గురువారం కన్నడ డబ్బింగ్ చిత్రం పినాక సినిమాలోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. మూడు రోజుల పాటు రామప్పలో సినిమా చిత్రీకరణ జరగనుంది. తొలిరోజు హీరో గణేశ్పై పురావస్తుశాఖకు చెందిన కొన్ని సన్నివేశాలను షూట్ చేశారు. సినిమా డైరెక్టర్ ధనుంజయ్ ఆధ్వర్యంలో ప్రొడక్షన్ మేనేజర్ శ్రీకాంత్, నరేశ్తో పాటు కళాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా డైరెక్టర్ ధనుంజయ్, హీరో గణేశ్ రామప్ప రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. రామప్ప ఆలయ విశిష్టత గురించి గైడ్ వెంకటేశ్ వివరించారు. కార్యక్రమంలో ఈఓ ఇమ్మడి భాస్కర్, టూరిస్టు, దేవాదాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
మట్టి విగ్రహాలనే
పూజించాలి
ములుగు: పర్యావరణ హితమైన మట్టి గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించి పర్యావరణాన్ని కాపాడాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ప్రజలకు సూచించారు. ఈ మేరకు గురువారం ఆదానీ అంబుజా సిమెంట్ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాన్ని రెడ్క్రాస్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీనివాస్, కంపెనీ ప్రతినిధులు అనుదీప్రెడ్డి, బండారి కృష్ణ ఎస్పీకి అందజేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను అందజేస్తున్న కంపెనీ ప్రతినిధులను ఎస్పీ అభినందించారు.
ఆధునిక విధానాలపై
ఆసక్తి పెంచుకోవాలి
చిట్యాల: రైతులు ఆధునిక, లాభాదాయకమైన వ్వవసాయ విధానాలను అవలంభించుకోవాలని జిల్లా ఆదనపు కలెక్టర్ ఎల్ విజయలక్ష్మి అన్నారు. ఈసందర్బంగా గురువారం మండలంలోని కొడవటంచ గ్రామంలో సమీకృత ఫామ్ ఫండ్ ద్వారా కలిగే ప్రయోజనాలు, ఆధునిక వ్వవసాయ పద్దతులు, పంటల వైవిధ్యీకరణపై రైతులకు అవగాహన కల్పించారు. అలాగే పశువుల, పెంపకం, భూగర్భ జలాల పెంపు, హార్టికల్చర్ సాగు, డ్రాగన్స్ ప్రూట్ సాగు వంటి కార్యక్రమాల ద్వారా రైతులు ఆదనపు ఆదాయాన్ని పోందే అవకాశాలు ఉన్నాయని అన్నారు. రైతులు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పధకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రంగాపూర్ టు సింగపూర్
భూపాలపల్లి అర్బన్: మారుమూల గ్రామం నుంచి ఉపాధ్యాయుడిగా ప్రస్థానం ప్రారంభించి ప్రభుత్వ పాఠశాలల విద్యాభివృద్ధికి కృషిచేస్తున్న తౌటం స్వామికి అంతర్జాతీయ విద్యా వేదికపై అధ్యయనం చేసే అవకాశం లభించింది. రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టీచర్స్ ఎక్స్పోసర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్సేంజ్ ప్రోగ్రాం టు సింగపూర్కు జిల్లా నుంచి ఆయన ఎంపికయ్యారు. ఈ నెల 12నుంచి 19వరకు జరిగే పర్యటనలో సింగపూర్ విద్యావిధానం, బోధనా పద్ధతులు, విద్యార్థి కేంద్రీకృత అభ్యసనం, పాఠశాల నిర్వహణ తదితర అంశాలను అధ్యయనం చేయనున్నారు.
రంగాపూర్ నుంచి ప్రస్థానం
మొగుళ్లపల్లి మండలం రంగాపూర్కు చెందిన స్వామి డీఎస్సీ 2006 ద్వారా ఎస్జీటీగా ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించారు. చింతలపల్లి, అంకుషాపూర్, పరకాల మండలం నాగారం పాఠశాలల్లో పనిచేసిన ఆయన ప్రస్తుతం ఎంపీపీఎస్ జంగేడులో ఎస్జీటీగా సేవలందిస్తున్నారు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే శిక్షకుడిగా, రిసోర్స్ పర్సన్గా, కంటెంట్ డెవలపర్గా విద్యాశాఖ కార్యక్రమాల్లో భాగస్వామ్యమయ్యారు. ప్రాథమిక విద్యలో అభ్యసన ప్రమాణాలను పెంపొందించే ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంలో ఎస్ఆర్పీ, డీఆర్పీగా పలు శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. టీచర్స్ హాండ్ బుక్స్(మాథ్యమెటిక్స్) రూపకల్పనలో కంటెంట్ డెవలపర్గా సేవలందించారు. విద్యారంగంలో ఆయన సేవలకు పలు గుర్తింపులు లభించాయి. 2023లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో ఉత్తమ రిసోర్స్ పర్సన్ అవార్డు, 2024లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు.


