ములుగు: విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంతో పాటు పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని బండారుపల్లి గల తెలంగాణ గురుకుల పాఠశాల(బాలుర), జూనియర్ కళాశాలను కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని తరగతి గదులు, వంటశాల, భోజనశాల, వసతిగృహం పరిసరాలను పరిశీలించారు. విద్యార్థుల హాజరు, బోధన, భోజన పట్టిక, సరుకుల నిల్వలకు సంబంధించిన నమోదులను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం, విద్య, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలన్నారు. వంటశాల, భోజనశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన మౌలిక వసతులను అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. పాఠ్యాంశాల బోధన, భోజనం, వసతిగృహ సౌకర్యాలు, తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణ తదితర వివరాలపై ఆరా తీశారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదివి ఉన్నతస్థాయికి చేరుకోవాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి ఉన్నారు.
కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు


