ములుగు: గణేశ్ నవరాత్రి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో విగ్రహాలను ఏర్పాటు చేసే నిర్వాహకులు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ములుగు డీఎస్పీ నలువాల రవీందర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో గతేడాది గణేశ్ మండపాలు ఏర్పాటు చేసిన నిర్వాహకులతో గురువారం ఆయన మాట్లాడారు. గణేశ్ మండపాల ఏర్పాటులో నిర్వాహకులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా మండపాలు ఏర్పాటు చేయవద్దన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడంతో పాటు ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్వాహకులకు సూచించారు. అనుమతి పొందిన మండపాల వివరాలను పోలీసులు నమోదు చేసుకుని, ఆయా ప్రాంతాల్లో భద్రతా చర్యలను పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. ఉత్సవాల సందర్భంగా ప్రజలకు, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఉత్సవాల పేరుతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ముఖ్యంగా యువత అత్యుత్సాహానికి పోకుండా సంయమనంతో, బాధ్యతగా వ్యవహరించాలని డీఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో ములుగు సీఐ దారం సురేశ్, ఎస్సై వెంకటేశ్ పాల్గొన్నారు.
ములుగు డీఎస్పీ నలువాల రవీందర్


