● జిల్లా ఎన్నికల అధికారి,
కలెక్టర్ హేమంత్ సహదేవరావు
ములుగు: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ–2026కు సంబంధించిన తాజా వివరాలను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎప్పటికప్పుడు వెల్లడించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు ఎన్నికల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ములుగు నియోజకవర్గానికి సంబంధించిన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో చేపడుతున్న ప్రతీ అంశాన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలియజేయాలని సూచించారు. ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ షెడ్యూల్ను ఈ నెల 19 నుంచి నవంబర్ 9వ తేదీ వరకు పొడిగించిన నేపథ్యంలో సవరించిన షెడ్యూల్ ప్రతులను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేసినట్లు తెలిపారు. ఈ నెల 2 నుంచి 8వ తేదీ వరకు అందిన దావాలు, అభ్యంతరాలకు సంబంధించిన ఫారాలు 9, 10, 11 జాబితాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేశారు. పోలింగ్ కేంద్రాల వారీగా అందిన దావాలు, అభ్యంతరాలు, ఓటర్లకు జారీ చేసిన నోటీసులు, వాటి ప్రస్తుత స్థితికి సంబంధించిన వివరాలను సమావేశంలో వెల్లడించారు. నియోజకవర్గంలోని 308 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందుబాటులో ఉంచినట్లు వివరించారు. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఉంటే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీఓ కృష్ణవేణి, ఎన్నికల విభాగం అధికారులు, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.


