ములుగు: ఈ నెల 17న నిర్వహించనున్న ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ సీహెచ్.మహేందర్జీ అధికారులను ఆదేశించారు. నూతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై వివిధ శాఖల జిల్లా అధికారులతో ఆయన బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నూతన కలెక్టరేట్ ప్రాంగణంలో మొదటిసారిగా నిర్వహించనున్న ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వేదిక, ప్రొటోకాల్ ప్రకారం ఏర్పాట్లు సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. జాతీయ పతాకావిష్కరణ సమయంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను పాటించాలని అధికారులను ఆదేశించారు. వేడుకలకు హాజరయ్యే ప్రజలు, అధికారులు, ప్రభుత్వ సిబ్బందికి అవసరమైన తాగునీటి సౌకర్యంతో పాటు ఇతర మౌలిక వసతులను కల్పించాలని తెలిపారు. ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. వివిధ శాఖల అధికారులు తమ కార్యాలయ సిబ్బందితో కలిసి తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ కృష్ణవేణి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ మహేందర్జీ


