ములుగు రూరల్: వంట కార్మికులకు తొమ్మిది నెలల అల్పాహారం పెండింగ్ బిల్లులు చెల్లించాలని తెలంగాణ మధ్యాహ్నా భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ కోరారు. ఈ మేరకు గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో వంట కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు రూ.10 వేలు వేతనం చెల్లించాలన్నారు. మధ్యాహ్నా భోజన పథకంలో విద్యార్థులకు కోడిగుడ్లు, నిత్యావసర సరుకులను ప్రభుత్వమే సరఫరా చేయాలని కోరారు. కారణాలు లేకుండా కార్మికులను తొలగిచడం సరికాదని తెలిపారు. ఈ విషయంపై స్పందించిన మంత్రి సీతక్క సీఎం రేవంత్రెడ్డి దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారని వివరించారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్నా భోజన కార్మికులు భారతి, ప్రమీల, తులసి, సఫియా, కమలక్క, పద్మ, సారమ్మ, స్వరూప తదితరులు పాల్గొన్నారు.


