ఏటూరునాగారం/కన్నాయిగూడెం: గిరిజన రైతులు ఆరుతడి పంటలపై దృష్టి పెట్టాలని, ఒకే రకమైన పంటలను పండించడం వల్ల నేల చౌడుబారుతుందని ఎన్హెచ్ఆర్సీ న్యూఢిల్లీ ట్రైబల్ వెల్ఫేర్ స్పెషల్ మానిటరింగ్ అధికారి హేమంత్ కుమార్ అన్నారు. జిల్లాలోని ఏటూరునాగారం మండల పరిధిలోని ముళ్లకట్టలోని ఇందిరమ్మ ఇళ్లు, శివాపురంలోని సబ్బుల పరిశ్రమ, కన్నాయిగూడెం మండలంలోని కంతనపల్లిలో గల పీఎం గిరివికాసం బోరు బావులను బుధవారం ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పోతో కలిసి హేమంత్కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా కంతనపల్లిలోని రైతులతో ఆయన మాట్లాడుతూ ఒకేరకమైన పంటలను పండించకుండా వరి, మిర్చి, ఇతర దేశవాలి పంటలను పండించాలని సూచనలు చేశారు. మార్కెట్లో ఏ రకమైన పంటకు డిమాండ్ ఉందని తెలుసుకొని దానిని పండించాలన్నారు. కంతనపల్లిలో 18 బోరు బావులను రెవెన్యూ, అటవీ భూముల్లో సాగు చేసుకున్న రైతులకు అందజేసినట్లు పీఓ వెల్లడించారు. కంతనపల్లి అడవిలో ఉన్న కంటైనర్ గిరిజన పాఠశాలను సందర్శించి పిల్లలకు పాఠాలను బోధించారు. విద్యార్థులు చక్కగా చదువుకోవాలని సూచించారు. అక్కడి నుంచి ముళ్లకట్టకు చేరుకొని ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. మండలంలో ఎన్ని మంజూరు చేశారని ఎంపీడీఓ శ్రీనివాస్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శివాపురంలోని సమ్మక్క సారలమ్మ సబ్బుల పరిశ్రమను పరిశీలించి తయారు చేస్తున్న మహిళలతో మాట్లాడారు. సబ్బుల తయారీలో ఉపయోగించే కెమికల్స్ను తక్కువ మోతాదులో మిక్సింగ్ చేయాలన్నారు. చేతులు మంటలు రాకుండా జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు. కలిసికట్టుగా పనిచేస్తూ యూనిట్ను మరింత అభివృద్ధిలోకి తీసుకెళ్లాలని వివరించారు. ఆయన వెంట ఐటీడీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గంట ప్రతాప్, అటవీశాఖ ఎఫ్డీఓ రమేశ్, డీడీ దబ్బగట్ల జనార్దన్, ఎంపీడీఓ శ్రీనివాస్, డీటీ అనిల్, జేడీఎం కొండల్రావు, సర్పంచ్లు, కార్యదర్శులు పాల్గొన్నారు.
న్యూఢిల్లీ ట్రైబల్ వెల్ఫేర్ స్పెషల్ మానిటరింగ్ అధికారి హేమంత్కుమార్


