వాజేడు: మండల పరిధిలోని చీకుపల్లి, పెద్దగొళ్లగూడెం గ్రామాల మధ్యన ఇసుక వాగు వద్ద డైవర్షన్ రోడ్డు పనులు ఇంకా కొనసాగుతున్నాయి. 163 జాతీయ రహదారిపై ఇసుక వాగు వద్ద రహదారి విస్తరణ పనుల్లో భాగంగా బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. మంగళవారం రాత్రి వరకు తాత్కాలికంగా నడకదారిని ఏర్పాటు చేశారు. బుధవారం పెద్ద పెద్ద సిమెంట్ పైపులు తీసుకొచ్చి నీళ్లు పోయేలా ఏర్పాటు చేసి వాటి పైనుంచి రహదారి పనులు మొదలు పెట్టారు. భారీ వర్షాలకు సోమవారం ఎన్హెచ్ తెగిపోయిన విషయం తెలియక తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా, నాగాలాండ్ తదితర రాష్ట్రాలకు చెందిన లారీలు వివిధ రకాల సరుకులతో ఛత్తీస్గఢ్ వైపునకు వెళ్లేందుకు భారీగా తరలివచ్చాయి. దీంతో రహదారి సౌకర్యం లేకపోవడంతో కోతకు గురైన రోడ్డుకు ఇరు వైపులా కిలో మీటర్ వరకు వాహనాలు నిలిచిపోయాయి.
శ్రీరాంనగర్ మీదుగా వాహనాల రాక
మండల పరిధిలోని శ్రీరాంనగర్ గ్రామం మీదుగా రెండు వాగులను దాటుతూ వాహనాలు వస్తున్నాయి. కోయ వీరాపురం, శ్రీరాంనగర్ గ్రామాల మధ్యన ముష్టి, రాళ్ల వాగు ఉన్నాయి. ఈ రెండు వాగుల వద్ద ప్రస్తుతం లోతు తక్కువగా ఉండడంతో వాహనాలు వచ్చి వెళ్తున్నాయి.
163 ఎన్హెచ్పై కిలోమీటర్ల మేర
నిలిచిన వాహనాలు
తాత్కాలికంగా నడకదారి ఏర్పాటు


