మావోల అలజడి!
● ఛత్తీస్గఢ్ నుంచి జిల్లాకు వచ్చారని
ఇంటెలిజెన్స్ సమాచారం
● తాడ్వాయి, కన్నాయిగూడెం అటవీ ప్రాంతాల్లో
పోలీసుల ముమ్మరంగా తనిఖీలు
● భయాందోళనలో ఏజెన్సీ ప్రజలు
ఏటూరునాగారం: ఆపరేషన్ కగార్–2లో భాగంగా ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టులను తుడిచిపెట్టేందుకు కేంద్ర బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. కర్రెగుట్టతోపాటు జిల్లాలోని తాడ్వాయి, కన్నాయిగూడెం అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి తలదాచుకున్నారనే ఇంటెలిజెన్స్ సమాచారంతో గ్రేహ్సౌండ్ దళాలు పెద్ద ఎత్తున కూంబింగ్ చేపట్టాయి. 2024 డిసెంబర్ 1న ఏటూరునాగారం మండలం చెల్పాక అటవీ ప్రాంతాల్లో ఏడుగురు మావోయిస్టులు పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందారు. అయితే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్రాంతాల్లో ఉన్న మావోయిస్టులు వరుస ఎన్కౌంటర్లలో మృతి చెందడంతో అప్పటి పీపుల్స్వార్కు కంచుకోటలా ఉన్న ఏటూరునాగారం అభయారణ్యం వైపు మళ్లీ మావోయిస్టులు అడుగులు వేశారనే విషయాన్ని పోలీసు ఇంటెలిజెన్స్ వర్గాలు బలపర్చుతున్నాయి. దీంతో ఎస్ఐబీ, స్పెషల్ పార్టీ దళాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ఏజెన్సీలోని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మావోయిస్టు పార్టీ కేంద్ర, రాష్ట్ర ముఖ్య నాయకులను టార్గెట్ చేసుకొని పోలీసులు తనిఖీలు చేపట్టారు. అయితే తాడ్వాయి, కన్నాయిగూడెం, తుపాకులగూడెం అటవీ ప్రాంతాల్లోనే తలదాచుకున్నట్లు పక్కా సమాచారం ఉంది. దీంతో పోలీసులు ఆ దిశగా కూంబింగ్ను మరింత వేగవంతం చేశారు.
వరుస ఘటనలు
గతంలో పోలీసులను టార్గెట్ పెట్టుకొని మావోయిస్టులు అమర్చిన ల్యాండ్మెన్లు పేలి నలుగురు సాధారణ వ్యక్తులు మృతి చెందగా ముగ్గురు జవాన్లు మృతి చెందారు. శుక్రవారం మావోయిస్టు ఏరివేతలో భాగంగా కర్రెగుట్టలో కూంబింగ్ చేస్తున్న కేంద్ర బలగాల్లోని జవాన్కు ఐఈడీ ల్యాండ్మెన్ పేలి నవదీప్ పాఠక్కు తీవ్ర గాయాలు అయ్యాయి. హెలికాప్టర్ ద్వారా సురక్షిత ప్రాంతానికి తరలించారు. అంతేకాకుండా అక్కడ పాతిపెట్టిన మరో 9 ల్యాండ్మెన్లు పోలీసు బలగాలు నిర్వీర్యం చేశాయి. అయితే ఏటూరునాగారం దట్టమైన అటవీ ప్రాంతాల్లో కూడా ల్యాండ్మెన్స్ ఉన్నాయనే అనుమానంతో పోలీసులు ముందస్తుగా జాగీలతో తనిఖీలు చేసి కూంబింగ్ను చేపట్టారు.
మావోల అలజడి!


