తుప్పు పడుతున్నాయ్..
వినియోగంలో లేక పాడైపోతున్న ఆట సామగ్రి
పార్కును వెంటనే పునరుద్ధరించాలి
పిల్లలకు ఆటవిడుపుగా ఉండాలి
ఏటూరునాగారం: చిన్నపిల్లలు ఆడుకునే చిల్డ్రన్ పార్క్ లక్షల రూపాయలు పెట్టి నిర్మించి నిర్లక్ష్యంగా వదిలేయడంతో సామగ్రి తుప్పుపట్టిపోతుంది. 2023 ఫిబ్రవరి 23లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంపీల్యాండ్స్ నిధుల నుంచి మాజీ ఎంపీ సీతారాంనాయక్ రూ.5 లక్షలు మంజూరు చేశారు. దీంతో ఏటూరునాగారం మండల కేంద్రంలోని గ్రామానికి చెందిన అటవీశాఖ సెంట్రల్ నర్సరీ ప్రాంతంలో చిల్డ్రన్ పార్క్ను నిర్మించారు. ఈ పార్క్ నిర్మాణం చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు దాని గురించి పట్టించుకున్న దాఖలాలు లేకుండా పోయాయి. దీంతో జారుడు బల్లా, సీసా, రింగ్ బల్లా, ఉయ్యాలలు, ఇతర సామగ్రి పాడైపోతున్నాయి. చిన్నారులు సాయంత్రం వేళలో ఆహ్లాదకరంగా ఆడుకునేలా అభివృద్ధి చేయాల్సిన గ్రామ పంచాయతీ, మండల పరిషత్ అధికారులు సైతం పట్టించుకోవడం లేదు. దీంతో ఆ సామగ్రి అంతా తుప్పుపట్టి పోతున్న పరిస్థితి నెలకొంది.
అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా..
చిల్డ్రన్ పార్కింగ్ నిరుపయోగంగా మారడంతో మందుబాబులకు అడ్డాగా మారింది. ఇదిలా ఉండగా గతంలో ఉన్న భూమి కాస్తా క్రమక్రమంగా కబ్జాకు గురవుతోంది. గతంలో నిర్మించుకున్న ఇళ్లలోని కొంత మంది చెత్తాచెదారం, వ్యర్థాలను ఈ ఖాళీ స్థలంలోనే పడవేస్తుండడంతో దుర్వాసన వెదజల్లుతుంది.
లక్షలు పెట్టారు.. లక్షణంగా వదిలేశారు..
ఎంపీ ల్యాండ్స్ కింద రూ. 5 లక్షలు వెచ్చించి నిర్మించిన చిల్డ్రన్ పార్క్ను లక్షణంగా వదిలేశారు. నిధులు కేటాయించారే గానీ దాని నిర్వహణను పట్టించుకోవడం లేదు. అప్పట్లో గ్రామ పంచాయతీకి నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. దాంతో ఎలాంటి ఆదాయం లేకపోవడంతో జీపీ సిబ్బంది నిర్లక్ష్యంగా వదిలేశారు. దీంతో సామగ్రి అంతా తుప్పుపట్టి పోతుందని స్థానికులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
రూ.5లక్షలతో నిర్మించిన చిల్డ్రన్ పార్క్
పట్టించుకోని అధికారులు
గ్రామంలోని చిన్నారులకు ఎంతో ఉపయోగపడే చిల్డ్ర న్ పార్క్ను వెంటనే పునరుద్ధరించాలి. ఎంతో విలువైన సామగ్రి తుప్పుపట్టిపోతుంది. అటవీశాఖ, ఇటు గ్రామకంఠం భూమి విషయంలో లెక్క తేలడం లేదు. దీంతో ఆ పార్క్ను ఎవరు పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి.
– బట్టు రమేష్, ఏటూరునాగారం
సెల్ ఫోన్స్, టీవీలకు పరిమితం అవుతున్నా ఈనాటి చిన్నారులకు ఆటవిడుపు ఉండాలి. సాయంత్రం వేళలో చిన్నారులు పార్క్కు వెళ్లి ఆడుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. ఇంట్లో ఉండి సెల్కు పరిమితమై అనారోగ్యాల బారిన పడుతున్నారు. వెంటనే పార్క్ను ఓపెన్ చేయాలి.
– చామర్తి కిశోర్, ఏటూరునాగారం
తుప్పు పడుతున్నాయ్..
తుప్పు పడుతున్నాయ్..
తుప్పు పడుతున్నాయ్..
తుప్పు పడుతున్నాయ్..


