పోరుదీక్ష పోస్టర్ ఆవిష్కరణ
భూపాలపల్లి రూరల్: ఈనెల 20న ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద తలపెట్టిన తెలంగాణ ఉద్యమ కళాకారుల పోరు దీక్షను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు జన్నె యుగేందర్ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో కళాకారులతో కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జన్నె యుగేందర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర సాధన కోసం తమ ఆటపాటల ద్వారా ప్రజలను చైతన్యపరిచి తెలంగాణ సాధించుకున్నామన్నారు. అయినప్పటికీ ఉద్యమ కళాకారులకు ఉపాధి లేకుండా నిరాశ్రయులుగా దీనస్థితిలో బతుకుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో కళాకారులు సెగ్గెం శ్రావణ్, రాజేష్, రాజా, సడవలి, మధుకర్, సమ్మరాజ్, రాజశేఖర్, సంధ్యారాణి, నిర్మల, రాజేశ్వరి, శోభ, పాల్గొన్నారు.


